Share News

Lok Sabha Elections: తెలంగాణ పోలీసుల నయా ప్లాన్.. వాట్సాప్‌తో..

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:53 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో(Lok Sabha Elections 2024) రాష్ట్రంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణా కట్టడికి తెలంగాణ పోలీసులు(Telangana Police) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లా పోలీసు అధికారులు, కేంద్ర బలగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.

Lok Sabha Elections: తెలంగాణ పోలీసుల నయా ప్లాన్.. వాట్సాప్‌తో..
WhatsApp Group

  • సరిహద్దులపై నిఘాకు.. అంతర్రాష్ట్ర పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌!

  • ఎన్నికల నేపథ్యంలో సమాచార మార్పిడి

  • తెలంగాణలో 145 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు

  • నోటిఫికేషన్‌కు ముందే పట్టుబడుతున్న నోట్ల కట్టలు

  • సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌పై ప్రత్యేక నిఘా

  • తమిళనాడు ఎన్నికలకు తెలంగాణ బలగాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో(Lok Sabha Elections 2024) రాష్ట్రంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణా కట్టడికి తెలంగాణ పోలీసులు(Telangana Police) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లా పోలీసు అధికారులు, కేంద్ర బలగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. నిరంతరం, సత్వర సమాచార మార్పిడికోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపును(WhatsApp Group) ఏర్పాటు చేశారు. పోలీసులతోపాటు రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులను ఆ గ్రూపులో చేర్చారు. కాగా.. తెలంగాణలో(Telangana) జరగనున్న లోక్‌సభ ఎన్నికల బందోబస్తుకు 145 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే 60 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్ర వ్యాప్తంగా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నాయి. దశల వారీగా మిగతా బలగాలు బందోబస్తు విధుల్లోకి వచ్చి, చేరనున్నాయి. ఎన్నికల నాటికి కేంద్ర బలగాలతోపాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో భాగస్వామ్యం చేయనున్నారు.


మార్చి 16న లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్లు విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిపిన తనిఖీల్లో మొత్తం రూ. 45 కోట్లు విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు పట్టుబడగా.. ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. రూ.50 కోట్ల సొత్తు పట్టుబడటం గమనార్హం..! నోటిఫికేషన్‌ వెలువడ్డ తర్వాత నగదు ప్రవాహం మరింత ఎక్కువగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో రాష్ట్రంతోపాటు, రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 466 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, రాష్ట్ర సరిహద్దుల్లో 85 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.


నోటిఫికేషన్‌ వెలువడ్డ తర్వాత ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, చెక్‌పోస్టుల సంఖ్య మరింతగా పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది తనిఖీల తీరు, పట్టుబడుతున్న నగదు ఇతరాత్ర వాటిని ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌పై పోలీసులు నిఘా పెట్టారు. కాగా, ఈ నెల 19న తమిళనాడులో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బందోబస్తుకు తెలంగాణ నుంచి 2 వేల మంది పోలీసులను తరలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 12:53 PM