Share News

Shreyas Iyer: మనసు మార్చుకున్న శ్రేయాస్ అయ్యర్.. రంజీ ట్రోఫి సెమీస్‌లో బరిలోకి?

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:36 PM

నిన్నమొన్నటి వరకు రంజీ ట్రోఫిలో ఆడకుండా మొండికేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రంజీల్లో బరిలోకి దిగనున్నట్టు సమాచారం.

Shreyas Iyer: మనసు మార్చుకున్న శ్రేయాస్ అయ్యర్.. రంజీ ట్రోఫి సెమీస్‌లో బరిలోకి?

నిన్నమొన్నటి వరకు రంజీ ట్రోఫిలో ఆడకుండా మొండికేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రంజీల్లో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. మార్చి 2 నుంచి తమిళనాడుతో జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై తరఫున శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి రంజీ ట్రోఫి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనే శ్రేయాస్ బరిలోకి దిగాల్సి ఉంది. బరోడాతో ముంబై ఆడిన మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. కానీ శ్రేయాస్ అయ్యర్ మాత్రం బరిలోకి దిగలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో శ్రేయాస్ అయ్యర్ విఫలమైన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల్లో 27, 29, 35, 13 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాతి 3 టెస్టులకు శ్రేయాస్ అయ్యర్‌ను టీమిండియాలోకి ఎంపిక చేయలేదు. శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి తిరిగిబెట్టిందని అందుకే జట్టులోకి తీసుకోలేదని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వరుస వైఫల్యాలతోనే శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకోలేదని నిర్ధారణ అయింది.


ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టులో లేని ఆటగాళ్లంతా రంజీల్లో ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అయితే శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి సాకుతో రంజీలకు దూరంగా ఉన్నాడు. కానీ ఇంతలోనే శ్రేయాస్ అయ్యర్‌కు ఎలాంటి గాయం కాలేదని, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ఏన్సీఏ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ ఉద్దేశపూర్వకంగానే రంజీలకు దూరంగా ఉన్నాడని అప్పటి నుంచి పెద్ద దుమారమే రేగుతోంది. శ్రేయాస్ అయ్యర్ కావాలనే రంజీలకు దూరంగా ఉంటున్నాడని విమర్శలు కూడా వస్తున్నాయి. అతను ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకుని రంజీలు ఆడడం లేదని పలువురు మండిపడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్‌తోపాటు ఇషాన్ కిషన్ కూడా ఇదే కోవలోకే వస్తాడు. అతను కూడా జైషా ఆదేశాలను బేఖాతరు చేసి రంజీలకు దూరంగా ఉంటున్నాడు. ఇంతలోనే బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి రంజీలకు దూరంగా ఉంటున్న ఆటగాళ్ల కాంట్రాక్టులను బీసీసీఐ రద్దు చేయబోతుందనే వార్తలు వచ్చాయి. బహుషా వీటిని దృష్టిలో ఉంచుకునే కావొచ్చు శ్రేయాస్ అయ్యర్ రంజీలు ఆడడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. నిజంగానే శ్రేయాస్ అయ్యర్ రంజీ ట్రోఫీ సెమీస్‌లో బరిలోకి దిగితే ఇషాన్ కిషన్ ఆడే అవకాశాలున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 08:36 PM