Share News

RR vs LSG: బ్యాటింగ్, బౌలింగ్‌లో కుమ్మేసిన రాజస్థాన్ రాయల్స్.. లక్నోపై జయభేరి

ABN , Publish Date - Mar 24 , 2024 | 07:37 PM

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది.

RR vs LSG: బ్యాటింగ్, బౌలింగ్‌లో కుమ్మేసిన రాజస్థాన్ రాయల్స్.. లక్నోపై జయభేరి

జైపూర్: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో లక్నో జట్టు 173/6కే పరిమితమైంది. నికోలస్ పూరన్(64), కృనాల్ పాండ్యా వంటి బిగ్ హిట్టర్లు అజేయంగా క్రీజులో ఉన్నప్పటికీ లక్నోను గెలిపించలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (2/35), సందీప్ శర్మ(1/22) ఆరంభంలోనే లక్నోను దెబ్బతీశారు. కీలకమైన డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేసిన రాజస్థాన్ బౌలర్లు జట్టుకు విజయాన్ని అందించారు.

చెలరేగిన బౌల్ట్

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోసూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. రాజస్థాన్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ లక్నోను దెబ్బ తీశారు. తొలి ఓవర్‌లోనే డికాక్(4)ను పెవిలియన్ చేర్చిన బౌల్ట్.. మూడో ఓవర్‌లో దేవదత్ పడిక్కల్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఆయుష్ బదోనిని సందీప్ శర్మ ఒక పరుగుకే ఔట్ చేశాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో లక్నోను కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా ఆదుకున్నారు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 26 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన హుడా 2 ఫోర్లు, 2 సిక్సులతో 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అయితే హుడాను స్పిన్నర్ చాహల్ పెవిలియన్ చేర్చడంతో 60 పరుగులకు లక్నో 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్‌తో కలిసి కెప్టెన్ రాహుల్ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 85 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో రాహుల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది 34వ హాఫ్ సెంచరీ.

డెత్ ఓవర్లలో కట్టడి

లక్నో విజయానికి చివరి 4 ఓవర్లలో 49 పరుగులు అవసరం అయ్యాయి. రాహుల్, పూరన్ క్రీజులో ఉండడంతో లక్నో గెలుస్తుందేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్‌లో సందీప్ శర్మ విడదీశాడు. 4 ఫోర్లు, 2 సిక్సులతో 44 బంతుల్లో 58 పరుగులు చేసిన రాహుల్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే మార్కస్ స్టోయినీస్(3)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 154 పరుగులకు లక్నో 6 వికెట్లు కోల్పోయింది. తన ఐపీఎల్ కెరీర్‌లో నికోలస్ పూరన్ ఆరో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి 2 ఓవర్లలో లక్నో విజయానికి 38 పరుగులు అవసరం కాగా సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్‌లో 11 పరుగులు, ఆవేష్ ఖాన్ వేసిన చివరి ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో లక్నో ఓటమిపాలైంది. 4 ఫోర్లు, 4 సిక్సులతో 41 బంతుల్లో 64 పరుగులు చేసిన పూరన్, కృనాల్ పాండ్యా(3) నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ 2, బర్గర్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు.


సంజూ శాంసన్ విధ్వంసం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ 11 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ కాసేపటికే ధాటికే ఆడుతున్న యశస్వీ జైస్వాల్‌ను మోహ్సీన్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 12 బంతుల్లోనే జైస్వాల్ 24 పరుగులు చేశాడు. దీంతో 49 పరుగులకు రాజస్థాన్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ 54/2 స్కోర్‌తో నిలిచింది. ఈ సమయంలో కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 59 బంతుల్లో 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యష్ ఠాకూర్ వేసిన 9వ ఓవర్‌లో శాంసన్ 2 సిక్సులు, పరాగ్ ఓ సిక్సు బాదడంతో 21 పరుగులొచ్చాయి. రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్‌లో శాంసన్, పరాగ్ చెరో సిక్సు బాదడంతో 15 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో రాజస్థాన్ స్కోర్ కూడా 100 పరుగులు దాటింది. అనంతరం సంజూ శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది 21వ హాఫ్ సెంచరీ. వరుసగా 5 ఐపీఎల్ సీజన్లలో మొదటి మ్యాచ్‌లో శాంసన్‌ను ఇది ఐదో 50+ స్కోర్ కావడం గమనార్హం.

రాజస్థాన్ భారీ స్కోర్

అయితే ఈ భాగస్వామ్యాన్ని 15వ ఓవర్‌లో నవీన్ ఉల్ హక్ విడదీశాడు. ఒక ఫోర్, 3 సిక్సులతో 29 బంతుల్లో 43 పరుగులు చేసిన పరాగ్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే షిమ్రోన్ హెట్‌మేయర్(5)ను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. దీంతో 150 పరుగులకు రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయింది. డెత్ ఓవర్లలో సంజూ శాంసన్, ధృవ్ జురేల్ చెలరేగారు. చివరి 21 బంతుల్లోనే 43 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసిన శాంసన్.. ఒక ఫోర్, ఒక సిక్సుతో 12 బంతుల్లో 20 పరుగులుచేసిన ధృవ్ జురేల్ నాటౌట్‌గా నిలిచారు. నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీయగా.. మోహ్సీన్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RR vs LSG: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. వరుసగా ఐదు సీజన్లలో..

RR vs LSG: వాట్ ఏ క్యాచ్ రాహుల్.. గాయం తర్వాత కూడా సూపర్ కీపింగ్



Updated Date - Mar 24 , 2024 | 07:50 PM