Share News

India TV Poll results: శ్రేయాస్, కిషన్‌ కాంట్రాక్టుల రద్దుపై సర్వే.. చివరకు తేలిందేటంటే..?

ABN , Publish Date - Mar 04 , 2024 | 07:31 PM

టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా నుంచి బీసీసీఐ తొలగించడంపై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.

India TV Poll results: శ్రేయాస్, కిషన్‌ కాంట్రాక్టుల రద్దుపై సర్వే.. చివరకు తేలిందేటంటే..?

టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా నుంచి బీసీసీఐ తొలగించడంపై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ అంశంపై రెండుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించడం సరైన నిర్ణయమేనా అనే అంశంపై ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టీవీ న్యూస్ సర్వే నిర్వహించింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవిస్తారా? అనే ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్నకు మొత్తంగా 9128 మంది తమ అభిప్రాయాలను ఓట్ల రూపంలో తెలిపారు. ముఖ్యంగా బీసీసీఐ నిర్ణయం సరైనదేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఏకంగా 66.76 శాతం మంది బీసీసీఐ నిర్ణయం సరైనదేని చెబుతూ అవును అని సమాధానం ఇచ్చారు. 29.10 శాతం మాత్రమే బీసీసీఐ నిర్ణయం సరైనది కాదని చెప్పారు. 5.07 శాతం మంది తాము ఏమి చెప్పలేమని ఓటు వేశారు.


అసలు ఏం జరిగిందంటే.. మానసిక సమస్యలతో సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన శ్రేయాస్ అయ్యర్‌ను మిగతా సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అలా జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ను రంజీ క్రికెట్ ఆడాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. ప్రస్తుతం టీమిండియాలో లేని ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందినేనని బీసీసీఐ కార్యదర్శి జైషానే స్వయంగా చెప్పాడు. కానీ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మాత్రం బోర్డు ఆదేశాలను పట్టించుకోలేదు. రంజీ టోర్నీలో ఆడలేదు. తనకు వెన్ను నొప్పికి సంబంధించిన సమస్య తిరిగబెట్టిందని, కాబట్టి తాను ప్రస్తుతం రంజీల్లో ఆడలేనని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. దీంతో ఏన్సీఏలో శ్రేయాస్ అయ్యర్‌ను పరిశీలించిన తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలోని స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ సంచలన విషయాలు బయటపెట్టాడు. శ్రేయాస్‌కు తాజా గాయాలు ఏవీ లేవని చెప్పాడు. దీంతో శ్రేయాస్ కావాలనే రంజీలకు డుమ్మా కొట్టాడని అర్థమైపోయింది. మరోవైపు రంజీలను పక్కనపెట్టిన ఇషాన్ కిషన్.. బరోడాలో హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రంజీలను పక్కనపెట్టి ఐపీఎల్ కోసం సిద్దమవుతున్నారని అంతటా విమర్శలు వచ్చాయి. ఇంతలోనే తాజాగా ప్రకటించిన కాంట్రాక్టుల జాబితాలో వీరిద్దరికి బీసీసీఐ చోటు కల్పించలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 07:31 PM