Share News

IND vs ENG: ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:50 PM

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 192 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ..

IND vs ENG: ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం.. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పరిస్థితి ఎలా ఉందంటే..

రాంచీ: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 192 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ యువ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్(52), ధృవ్ జురేల్(39) అద్వితీయ పోరాటంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో రోహిత్ సేన కైవసం చేసుకుంది. అంతేకాకుండా స్వదేశంలో వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదుచేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించిన ధృవ్ జురేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో టీమిండియా తమ రెండో స్థానాన్ని పదిలపరచుకుంది.


డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక 2023-2025 సైకిల్‌లో టీమిండియాకు ఇది ఐదో విజయం. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన టీమిండియా 5 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ డ్రా కాగా.. రెండింటిలో ఓడింది. 64 శాతం విజయాలు సాధించిన భారత్ ఖాతాలో 62 పాయింట్లున్నాయి. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన న్యూజిలాండ్ 75 శాతం విజయాలతో టాప్ ప్లేసులో ఉంది. టీమిండియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన ఇంగ్లీష్ జట్టు 3 విజయాలు, 5 పరాజయాలు, ఒక డ్రాతో 21 శాతంతో మాత్రమే విజయాలు సాధించింది. మిగతా జట్ల విషయానికొస్తే ఆస్ట్రేలియా మూడో స్థానంలో, బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో, పాకిస్థాన్ ఐదో స్థానంలో, వెస్టిండీస్ ఆరో స్థానంలో, సౌతాఫ్రికా ఏడో స్థానంలో, శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 02:50 PM