Share News

IND vs ENG: భారీ ఆధిక్యం దిశగా టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:50 AM

కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో గిల్ సత్తా చాటాడు.

IND vs ENG: భారీ ఆధిక్యం దిశగా టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

వైజాగ్: కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో గిల్ సత్తా చాటాడు. హాఫ్ సెంచరీతో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే దిశగా భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 28/0తో మూడో రోజు ఆటలో తమ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరంభలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(13), యశస్వి జైస్వాల్‌(17)ను ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. రోహిత్ శర్మ అయితే రెండో రోజు సాధించిన స్కోర్‌కు ఒక పరుగు కూడా జోడించలేకపోయాడు. దీంతో 30 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో జట్టును శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరు జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్‌లో గిల్‌కు ఇది ఐదో హాఫ్ సెంచరీ.


ఈ భాగస్వామ్యాన్ని 28వ ఓవర్‌లో స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ విడదీశాడు. 29 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్‌కు దొరికిపోయాడు. పరిగెత్తుతూ స్టోక్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో 111 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే 9 పరుగులు చేసిన అరంగేట్ర ఆటగాడు రజత్ పటీదార్ కూడా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో గిల్(60), అక్షర్ పటేల్(2) ఉన్నారు. 30 ఓవర్లపాటు సాగిన తొలి సెషన్‌లో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 102 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత జట్టు 273 పరుగుల అధిక్యంలో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396, ఇంగ్లండ్ 253 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 11:55 AM