Share News

Ranji Trophy: రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లను ఫ్రీగా ఇక్కడ చూసేయండి..

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:55 PM

రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి సెమీస్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో విదర్భ, మధ్యప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలో జరిగే రెండో సెమీస్ పోరులో ముంబై, తమిళనాడు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి.

Ranji Trophy: రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లను ఫ్రీగా ఇక్కడ చూసేయండి..

రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి సెమీస్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో విదర్భ, మధ్యప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలో జరిగే రెండో సెమీస్ పోరులో ముంబై, తమిళనాడు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్ ఫైనల్‌లో బరోడాతో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. తమిళనాడుతో జరిగే సెమీస్ మ్యాచ్‌లో ముంబై తరఫున శ్రేయాస్ అయ్యర్ కూడా బరిలోకి దిగుతున్నాడు. దీంతో ఇది ఆ జట్టుకు బలాన్ని చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు. 41 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న ముంబై టైటిల్ ఫెవరేట్‌గా ఉంది. అయితే కెప్టెన్ అంజిక్యా రహానే ఫామ్ ముంబైని కలవరపెడుతోంది. ఈ సీజన్‌లో రహానే ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. రహానే విఫలమైనప్పటికీ శివమ్ దూబే, షామ్స్ ములానీ నిలకడైన ప్రదర్శన ఇవ్వడంతో ముంబై సెమీస్ చేరింది.


ఇక తమిళనాడు విషయానికొస్తే తమ స్పిన్ యూనిట్‌పైనే ఆ జట్టు ప్రధానంగా ఆధారపడింది. ఈ సీజన్‌లో టాప్ 2 వికెట్ టేకర్లు సాయి కిషోర్, అజిత్ రామ్ తమిళానాడులోనే ఉండడం గమనార్హం. నాగ్‌పూర్ వేదికగా జరిగే మరో సెమీస్ పోరులో ఐదు సార్లు ఛాంపియన్ మధ్యప్రదేశ్ జట్టు విదర్భతో తలపడనుంది. ఈ సీజన్‌లో అజేయంగా నిలిచిన రెండు జట్లలో మధ్యప్రదేశ్ ఒకటి. గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన విదర్భ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటకపై 127 పరుగుల తేడాతో గెలిచింది. కాగా శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు ముగియనున్నాయి. స్పోర్ట్స్ 18 ఛానెల్ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీంతో టీవీల్లో రంజీ సెమీస్ మ్యాచ్‌లు చూడాలనుకునే వారు స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో చూడొచ్చు. మొబైల్స్‌ల్లో మ్యాచ్‌లను చూడాలనుకునేవారు జియో సినిమా యాప్‌లో వీక్షించొచ్చు. అలాగే ఈ మ్యాచ్‌లను చూడడానికి వినియోగదారులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఉచితంగా చూడొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 03:55 PM