Share News

Shakib Al Hasan: పార్లమెంట్ ఎన్నికల్లో వరల్డ్ కప్ కెప్టెన్ ఘన విజయం

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:28 AM

బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ దేశ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు.

Shakib Al Hasan: పార్లమెంట్ ఎన్నికల్లో వరల్డ్ కప్ కెప్టెన్ ఘన విజయం

ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ దేశ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌పై షకీబ్ అల్ హసన్ 1,50,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో హుస్సేన్‌కు 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ ఎన్నికల కోసమే క్రికెట్ నుంచి సెలవు తీసుకున్నారు. పోలింగ్‌కు ముందు కూడా గెలుపుపై ఆత్మ విశ్వాసంతో కనిపించారు. తన విజయానికి పెదగా అడ్డంకులు లేవని, అయితే గెలుపు కోసం ఆత్రుతగా ఉన్నానని చెప్పుకొచ్చారు. పోటీ, సవాళ్లు ఎల్లప్పుడు ఉంటాయని, అది చిన్న జట్టైనా, పెద్ద జట్టైనా అని అన్నారు. చివరకు తన ఆత్మవిశ్వసానికి అనుగుణంగానే ఎన్నికల్లో విజయం సాధించారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో షకీబ్ అల్ హసన్ చివరగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆడారు. ఆ ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబే వ్యవహరించారు.


స్పిన్ ఆల్‌ రౌండర్ అయినా 36 ఏళ్ల షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 66 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 39 సగటుతో 4,454 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 233 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 37 సగటుతో 7,570 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 317 వికెట్లు తీశాడు. టీ20ల్లో 23 సగటుతో 2,382 పరుగులు చేసిన షకీబ్.. బౌలింగ్‌లో 140 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఎంపీగా విజయం సాధించిన షకీబ్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆదివారం 300 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించారు. ఫలితాల్లో అవామీ లీగ్ పార్టీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనా ఈ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ఏకంగా 200 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ వరుసగా ఐదో సారి అధికారంలోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మీడియాకు అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే అవామీ లీగ్ మెజారిటీ స్థానాల్లో గెలిచిందని పేర్కొన్నారు. లెక్కింపు పూర్తిగా ముగిసిన తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నట్టు చెప్పారు. కాగా ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ సహా డజనుకు పైగా విపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఇది ఒక రకంగా అధికార పార్టీ అవామీ లీగ్‌కు కలిసొచ్చింది. అయితే విపక్షాలు ఎన్నికలను బహిష్కరించడం పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. 2018లో 80 శాతంగా నమోదైన పోలింగ్ ఈ సారి ఏకంగా సగానికి పడిపోయింది.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 08:37 AM