Share News

Budget Session 2024 : రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమవేశాలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:38 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెడతారు.

 Budget Session 2024 : రేపటినుంచి పార్లమెంట్ బడ్జెట్ సమవేశాలు

ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెడతారు. ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. ఎన్నికల నేపథ్యంలో విధానపర ప్రకటనలు ఏమి ఉండకపోవచ్చు. ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఏప్రిల్- జులైకి కావాల్సిన నిధులను ప్రో రేటా ప్రాతిపదికన భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం 2024-25 ఏడాదికి జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు.

పెరగనున్న కిసాన్ సన్మాన్ నిధి

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని 50 శాతం పెంచే అవకాశం ఉంది. కిసాన్ సన్మాన్ పథకం ద్వారా భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల పంట సాయాని మూడు విడతలుగా అందిస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.9 వేలకు పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వంపై రూ.12 వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది.

వరసగా ఆరోసారి బడ్జెట్ ప్రతిపాదన

ఆర్థికమంత్రిగా వరసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తున్నారు. ఐదు సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించారు. ఈ సారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదిస్తారు. వరసగా ఆరోసారి బడ్జెట్ సమర్పించిన మహిళ నేతగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్థానంలో నిర్మలా సీతారామన్ నిలుస్తారు. అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా తర్వాత బడ్జెట్‌ ప్రతిపాదించిన మహిళా నేతగా నిర్మలా సీతారామన్ నిలిచారు.

కొత్త సంప్రదాయం

2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2014-15, 2015-16, 2016-2017, 2017-2018, 2018-2019 ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జైట్లీ అనారోగ్యానికి గురికావడంతో 2019-2020 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం పీయూష్ గోయల్‌కు వచ్చింది. 2019లో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. జైట్లీ సూచనలతో నిర్మలా సీతారామన్‌కు ప్రధాని మోదీ ఆర్థిక శాఖ బాధ్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా వరసగా బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం వచ్చింది. రెండో అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా రికార్డు సృష్టించారు. తన బడ్జెట్‌లో సంస్కరణలకే నిర్మలా సీతారామన్ ప్రాధాన్యం ఇచ్చారు. సూట్ కేసులా కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయానికి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు.

మరిన్ని బడ్జెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 01:43 PM