Share News

Elections 2024: మీ దారి మీది.. నా దారి నాది.. పార్టీకి ఉపాధ్యక్షుడు రాజీనామా..

ABN , Publish Date - Apr 01 , 2024 | 10:48 AM

లోక్‌సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024 ) ముందు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని జయంత్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ) జాతీయ ఉపాధ్యక్షుడు షాహిద్ సిద్ధిఖీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు.

Elections 2024: మీ దారి మీది.. నా దారి నాది.. పార్టీకి ఉపాధ్యక్షుడు రాజీనామా..

లోక్‌సభ ఎన్నికలకు ( Lok Sabha Elections 2024 ) ముందు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని జయంత్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ) జాతీయ ఉపాధ్యక్షుడు షాహిద్ సిద్ధిఖీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జయంత్ సింగ్‌కు పంపినట్లు వెల్లడించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో మౌనంగా ఉండటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఆర్‌ఎల్‌డీకి దూరమైనా జయంత్ కు ఎప్పుడూ కృతజ్ఞుడనే అని తెలిపారు. భారమైన హృదయంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

"బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకోవాలనే ఆర్ఎల్డీ నిర్ణయంతో రాజీపడలేకపోతున్నా. అలా చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లే. పార్టీ కోసం నేను ఎన్నో ఏళ్లు కష్టపడ్డాను. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని నేను అంగీకరించలేను. ఎన్డీఏ కూటమితో కలిసి ఉండలేను. మీకు సలహా ఇచ్చే స్థితిలో నేను లేను. కానీ నా దారి నేను చూసుకోవాలి అని అనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు."

- రాజీనామా లేఖలో సిద్ధిఖీ


ఆర్‌ఎల్‌డీ ఇటీవలే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని రెండు స్థానాలకు అభ్యర్థులనూ ప్రకటించింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఆర్‌ఎల్‌డీ 2019లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 10:48 AM