Share News

Republic Day 2024 Live Updates: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీశక్తి

ABN , First Publish Date - Jan 26 , 2024 | 07:40 AM

దేశ రాజధాని దిల్లీలో చేపట్టిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. అతిరథ మహారథుల మధ్య వివిధ రంగాలు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సారి నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు చూపుతిప్పుకోకుండా చేశాయి. వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు.. ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా నిలిచాయి. వాయు విన్యాసాలు తల ఎత్తుకునేలా చేశాయి. చివరగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలందరికీ అభివాదం చేసి వేడుకలకు ముగింపు పలికారు.

Republic Day 2024 Live Updates: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీశక్తి

Live News & Update

  • 2024-01-26T13:00:00+05:30

    కర్తవ్య పథ్ పై ప్రధాని..

    ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరోసారి కర్తవ్య పథ్ పై పయనించారు. అక్కడున్న వారిని పలకరించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరారు.

  • 2024-01-26T12:45:00+05:30

    అందరి చూపు.. ఆకాశం వైపు..

    ఫ్లైపాస్ట్ సమయంలో 54 విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ షో నిర్వహించారు. వీటిలో ఫ్రెంచ్ వైమానిక దళం, అంతరిక్ష దళానికి చెందిన మూడు విమానాలు, భారత వైమానిక దళానికి చెందిన 46 విమానాలు, భారత నౌకాదళంలోని ఒకటి, ఆర్మీకి చెందిన నాలుగు హెలికాప్టర్లు ఉన్నాయి.

  • 2024-01-26T12:15:00+05:30

    భిన్నత్వంలో ఏకత్వం..

    దిల్లీలోని కర్తవ్య పథ్ లో జరుగుతున్న రిపబ్లిక్ డే-2024 వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో 1500 మంది నృత్యకారులు భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని అందించారు. వేషభాషలు వేరైనా మనమంతా ఒకటే అనే భావన కలిగించారు.

  • 2024-01-26T12:00:00+05:30

    అయోధ్య థీమ్‌తో..

    అయోధ్య థీమ్ తో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శకటం ప్రదర్శితమవుతోంది. 'అయోధ్య: వీక్షిత్ భారత్-సమ్రాధ్ విరాసత్' ఆధారంగా ఈ శకటాన్ని రూపొందించారు. ముందు భాగం రామ్ లల్లా చిన్ననాటి రూపాన్ని తయారు చేశారు. ప్రాణప్రతిష్ఠకు గుర్తుగా ఈ థీమ్ తో శకటాన్ని ప్రదర్శిస్తున్నారు.

  • 2024-01-26T11:45:00+05:30

    శకటాల ప్రదర్శన..

    గణతంత్ర వేడుకల పరేడ్ లో భాగంగా కర్తవ్య పథ్ లో రాష్ట్రాల శకటాలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే హరియాణా, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.

  • 2024-01-26T11:30:00+05:30

    వైమానిక దళం కవాతు..

    స్క్వాడ్రన్ లీడర్ రష్మీ ఠాకూర్ నేతృత్వంలో ఎయిర్ ఫోర్స్ బృందంలో 144 మంది ఎయిర్‌మెన్, నలుగురు అధికారులు పరేడ్ లో పాల్గొన్నారు. స్క్వాడ్రన్ లీడర్లు సుమితా యాదవ్, ప్రతీతి అహ్లువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్ కీర్తి రోహిల్ అదనపు అధికారులుగా కవాతు చేస్తున్నారు. భారతీయ వైమానిక దళం థీమ్ సామర్థ్యం, బలమైన, స్వావలంబనగా చాటి చెబుతున్నారు.

  • 2024-01-26T11:15:00+05:30

    మహిళా అధికారులే సారథులుగా..

    కర్తవ్య పథ్ లో వెపన్ లొకేటింగ్ రాడార్ సిస్టమ్ 'స్వాతి', మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్, డ్రోన్ జామర్ సిస్టమ్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ లు వెళ్లాయి. మిలిటరీ పోలీసు కెప్టెన్ సంధ్య నేతృత్వంలోని సభ్యుల బృందం మహిళలే కావడం విశేషం. మహిళా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ టీమ్‌లో మేజర్ సృష్టి ఖుల్లార్ నాయకత్వం వహిస్తున్నారు. ఆర్మీ డెంటల్ కార్ప్స్‌కు చెందిన కెప్టెన్ అంబా సమంత్, ఇండియన్ నేవీకి చెందిన సర్జన్ లెఫ్టినెంట్ కాంచన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ దివ్య ప్రియ ఉన్నారు.

  • 2024-01-26T11:00:00+05:30

    త్రివర్ణ పతాకాలతో పరేడ్ స్టార్ట్..

    75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను మువ్వన్నెల జెండాల రెపరెపల మధ్య ప్రారంభించారు. కర్తవ్య పథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా వందనం చేసి పరేడ్ ను స్టార్ట్ చేశారు.

  • 2024-01-26T10:30:00+05:30

    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవులు అధ్యక్షుడు..

    75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

  • 2024-01-26T09:45:57+05:30

    సిద్దిపేటలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

    సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు.

  • 2024-01-26T09:30:26+05:30

    రిపబ్లికే శుభాకాంక్షలు చెప్పిన హిమవీర్లు

    భారతదేశం-చైనా సరిహద్దులో దట్టమైన మంచు ప్రాంతాల్లో ఉన్న ఐటీబీపీకి చెందిన భారత సైనికులు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండాను చేత పట్టుకుని దేశప్రజలకు హిమ్‌వీర్లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • 2024-01-26T09:30:11+05:30

    జెండా ఎగురవేసిన సీఎం యోగి

    దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో సీఎంలు, గవర్నర్లు జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా లక్నోలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • 2024-01-26T09:15:26+05:30

    దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

    75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని హిందీ, ఇంగ్లీష్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. జై హింద్!’’ అని ట్వీట్ చేశారు.

  • 2024-01-26T09:15:24+05:30

    జాతీయ జెండాను ఎగురవేసిన సీఎంలు

    దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, బిహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఒడిషా గవర్నర్ రఘుబర్ దాస్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు తమ తమ రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.

  • 2024-01-26T09:00:43+05:30

    జెండా ఎగురవేసిన నడ్డా

    రిపబ్లిడే వేడుకల సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మువన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. 'భారత్‌ను అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన దేశంగా మార్చాలని మేము సంకల్పించాము.’’ అని అన్నారు.

  • 2024-01-26T09:00:26+05:30

    జెండా ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్

    విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

  • 2024-01-26T08:45:30+05:30

    మీ ఏబీఎన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ప్రత్యక్ష ప్రసారం

    దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై పబ్లిక్ గార్డెన్స్‌లో, సీఎం రేవంత్ రెడ్డి తన స్వగృహంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను చూడాలనుకుంటే క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

  • 2024-01-26T08:45:23+05:30

    రిపబ్లిడే శుభాకాంక్షలు తెలిపిన లోకేష్

    75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మ‌న‌ది. స్వేచ్ఛ, స‌మాన‌త్వం, హ‌క్కులను రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని లోకేష్ పేర్కొన్నారు.

  • 2024-01-26T08:30:57+05:30

    రూ.2 లక్షల రుణమాఫీపై గవర్నర్ కీలక ప్రకటన

    ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీపై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక ప్రకటన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంపై బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. అంతేకాండా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.

  • 2024-01-26T08:30:51+05:30

    రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

    రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజా ప్రభుత్వంలో వాటిని నిర్మించుకుంటున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంది. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు లభించాలనే లక్ష్యంతో పని చేస్తోంది అని’ తమిళి సై సౌందర రాజన్ సందేశం ఇచ్చారు.

  • 2024-01-26T08:15:32+05:30

    జెండా ఎగురవేసిన సీఎం

    75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళనాడు వ్యాప్తంగా గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

  • 2024-01-26T08:15:17+05:30

    జెండా ఎగురవేసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

    నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • 2024-01-26T08:00:47+05:30

    జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

    దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు రేవంత్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

  • 2024-01-26T08:00:26+05:30

    పద్మశ్రీ వరించిన తెలుగువాళ్లు వీళ్లే!

    తెలంగాణ నుంచి కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారికి, ఏపీకి చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. పద్మవిభూషణ్ పొందిన చిరంజీవి, వెంకయ్య నాయుడును కూడా కలుపుకుంటే మొత్తం 8 మంది తెలుగు వాళ్లకు ఈసారి పద్మ అవార్డులు దక్కాయి.

  • 2024-01-26T07:45:18+05:30

    చిరు, వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. ఈ సారి మొత్తం ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మంది పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.

  • 2024-01-26T07:30:36+05:30

    దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వేడుకలు మొదలవగా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

  • 2024-01-25T10:45:00+05:30

    ముఖ్య అతిథిగా మేక్రాన్..

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక కవాతు స్వీకరించారు. రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఉన్నారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

  • 2024-01-25T10:30:00+05:30

    చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో..

    75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జెండా వందనం చేశారు. ఎందరో మహనీయుల తాగ్యఫలం వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అని అన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం తనకు ఎంతో ప్రత్యేకమైనదని.. పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు. 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చిందని, ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.