Share News

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:43 AM

వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌. సికింద్రాబాద్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్‌ హోదా లభించగా, కరీంనగర్‌ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది.

Union Ministry : కిషన్‌రెడ్డికి రెండో సారి కిరీటం

  • కిషన్‌రెడ్డికి మళ్లీ కిరీటం

  • మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు

  • అంకితభావం కలిగిన నేతకు పట్టం

  • 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి: కిషన్‌రెడ్డి

పోరాటానికి దక్కిన ఫలితం

కార్పొరేటర్‌ స్థాయి నుంచి..కేంద్ర మంత్రిగా సంజయ్‌

తెలంగాణ సర్కారుకు పూర్తి సహకారమందిస్తా: బండి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ బీజేపీలో అంకితభావం కలిగిన నేతలు. పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా, అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా పనిచేస్తూ సమర్థత నిరూపించుకున్న వారిద్దరూ కేంద్ర మంత్రులయ్యారు. ఆ ఇద్దరే... గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌. సికింద్రాబాద్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్‌ హోదా లభించగా, కరీంనగర్‌ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన బండి సంజయ్‌కి, సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ ఇద్దరు కూడా గడచిన మూడు దశాబ్దాలుగా పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్నారు. ఇందుకు గుర్తింపుగా వారిని మంత్రి పదవులు వరించాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర క్యాబినెట్‌లో ఓసీ, బీసీ సమతుల్యత సాధించినట్లయ్యిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

  • కిషన్‌రెడ్డి సమర్థతకు మరో అవకాశం

ముందునుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగానే కిషన్‌రెడ్డికి క్యాబినెట్‌లో ప్రధాని మోదీ మరోసారి అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డి, మొదట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల అనంతరం, ప్రమోషన్‌ పొంది క్యాబినెట్‌ హోదాతో పర్యాటక, సాంస్కృతికశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి సమర్థత నిరూపించుకున్నారు. ఇటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అటు కేంద్ర మంత్రిగా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఒక్కో మెట్టు ఎదుగుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవులు నిర్వహించి సత్తా చాటుకున్నారు. అరెస్సెస్‌ నేర్పిన క్రమశిక్షణ, జాతీయవాదం పట్ల ఆకర్షణ దిశగా కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. బీజేపీ అభ్యున్నతికి రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో తనవంతు పాత్ర పోషించారు. అభిమానులంతా కిషనన్న అని పిలుచుకునే కిషన్‌రెడ్డిని మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు.


  • పోరాటయోధుడికి చాన్స్‌

తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్‌ని కేంద్ర మంత్రి పదవి వరించింది. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా తట్టుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సంజయ్‌, జాతీ య నాయకత్వం ప్రశంసలందుకున్నారు. ఏడాది కిందట తనను అనూహ్యంగా రాష్ట్రసారధ్య బాధ్యతల నుంచి తప్పించిన సందర్భంలో సంజయ్‌, తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే, ఎక్కడా పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని ప్రశ్నించలేదు. ఇదే సమయంలో, సంజయ్‌ను తప్పించడం వల్ల పార్టీలో అసంతృప్తి వచ్చిన విషయాన్ని జాతీయ నాయకత్వం కొద్దిరోజుల్లోనే గుర్తించింది. పొరపాటు దిద్దుబాటులో భాగంగా ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టింది. అయినా, పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి కొనసాగింది. ఈ సమయంలో, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పార్టీ జాతీయ నాయకత్వం బీసీ సీఎం నినాదం తెరపైకి తెచ్చింది. ఇది పెద్దగా ఫలితమివ్వలేదు.. పైగా, ఎంపీగా ఉన్న సంజయ్‌, ఎమ్మెల్యేగా పోటీచేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో, తాజా ఎంపీ ఎన్నికల్లో మరోసారి కరీంనగర్‌ నుంచి పోటీ చేసిన సంజయ్‌ విజయం సాధించారు. కరీంనగర్‌ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఎంపీల్లో సీహెచ్‌ విద్యాసాగర్‌రావు తర్వాత బండి సంజయ్‌కి కేంద్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లభించింది.

  • తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని, మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో పదేళ్లలో కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన గెలుపు కోసం పని చేసిన పదాధికారులు, మోర్చాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.


రాజకీయాలు పక్కనపెట్టి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం

  • తెలంగాణ సర్కారుకు పూర్తి సహకారమందిస్తా: కేంద్రమంత్రి బండి సంజయ్‌

న్యూఢిల్లీ/గణేశ్‌నగర్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఇక రాజకీయాలు పక్కనపెట్టి సమష్టిగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం కేంద్రంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని మోదీ, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా.. తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. కాగా, బండి సంజయ్‌ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో కరీంనగర్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కరీంనగర్‌ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో సంజయ్‌ ప్రమాణాన్ని పార్టీ నేతలు వీక్షించారు. అనంతరం గీతాభవన్‌ చౌరస్తాలో కార్యకర్తలు టపాసులు కాల్చారు.

Updated Date - Jun 10 , 2024 | 04:43 AM