Share News

Election Results: అధికార బీజేపీపై అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:27 PM

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో గల కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అధిక్యంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్‌కుగానూ ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి.

Election Results: అధికార బీజేపీపై అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్ జిల్లాలో గల కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అధిక్యంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్‌కుగానూ ఇప్పటివరకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు వెలువడిని ఫలితాల ప్రకారం బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనర్ 3,283 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు రూపిందర్ సింగ్‌కు 42,834 ఓట్లు రాగా.. సురేంద్ర పాల్ సింగ్‌కు 39,951 ఓట్లు వచ్చాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభించారు.


శ్రీగంగానగర్‌లోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ప్రభుత్వ కళాశాలలో 17 కౌంటర్లలో కౌంటింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ జనవరి 5న జరిగింది. కాగా గతేడాది నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగాను 199 నియోకవర్గాలకు ఆ రోజే పోలింగ్ నిర్వహించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ను వాయిదా వేశారు. అనంతరం డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 115 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గుర్మీత్ సింగ్ కూనర్ కుమారుడు రూపిందర్ సింగ్ బరిలోకి దిగాడు. ఇప్పటికే రాజస్థాన్ మంత్రి వర్గంలో చేరిన సురేంద్రపాల్ సింగ్ బీజేపీ నుంచి బరిలోకి దిగారు.

Updated Date - Jan 08 , 2024 | 01:27 PM