Share News

BJP: కుల గణనకు బీజేపీ వ్యతిరేకమా.. జేపీ నడ్డా ఏమన్నారంటే

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:27 PM

కుల గణనపై బీజేపీ తన వైఖరి ఏంటో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి తరచూ వినిపించే ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).

BJP: కుల గణనకు బీజేపీ వ్యతిరేకమా.. జేపీ నడ్డా ఏమన్నారంటే

చింద్వారా: కుల గణనపై బీజేపీ తన వైఖరి ఏంటో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి తరచూ వినిపించే ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda). మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డా మాట్లాడుతూ.. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే సమాజాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం జ్ఞాన్, గరీబ్, యువ, అన్నదాత-కిసాన్, నారీశక్తి (పేద, యువత, రైతులు, మహిళలు) సాధికారతపై దృష్టి సారించింది.

ఈ రంగంలో పురోగతి దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది. దేశంలో రాజకీయాలను మోదీ మార్చడంతో ప్రతిపక్ష పార్టీలు అయోమయంలో పడ్డాయి. మోదీ(PM Modi) హయాంలో అభివృద్ధి రాజకీయాలు ప్రధాన వేదికగా మారాయి. ప్రజలు అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఓటు బ్యాంకులు, బుజ్జగింపులపై ఆధారపడి లేవు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, మాజీ సైనికుల సంక్షేమం కోసం 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' (OROP) అమలు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను మోదీ తీసుకున్నారు. 2014కి ముందు దేశం అవినీతితో సతమతమైంది. కానీ ఇప్పుడు భారతదేశం మనువాద దేశం కాదు, అగ్రగామి దేశం.


ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక.. దేశ ఆర్థిక వ్యవస్థ 2027 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఆరు రెట్లు, ఔషధాల ఎగుమతులు 138 శాతం, పెట్రోకెమికల్ ఎగుమతులు 108 శాతం పెరిగాయి. మధ్యప్రదేశ్‌లో 14 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ లాడ్లీ బెహనా యోజనతో మహిళలకు సాధికారత కల్పిస్తోంది.

Jaipur: కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే.. దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందన్న మోదీ

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (INDIA Bloc) అవినీతిపరులను, వారి కుటుంబాలను రక్షించడానికి తాపత్రయపడుతోంది. రాహుల్, ప్రియాంక గాంధీలాగే మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్ రాజవంశ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీలో మాత్రమే పేద కుటుంబంలోని వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు. పార్టీ అలాంటి అవకాశాలు నేతలకు కల్పిస్తుంది" అని నడ్డా పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 08:28 PM