Share News

AP Politics: అవ్వా తాతలపై ఎవరికి ప్రేమ?..ఇదీ నిజం..

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:56 AM

‘నా అవ్వా తాతలు’ అంటూ ప్రేమ ఒలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్‌ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇదో చర్చనీయాంశంగా మారింది.

 AP Politics: అవ్వా తాతలపై ఎవరికి ప్రేమ?..ఇదీ నిజం..

జగన్‌వి కోతలు.. బాబువి చేతలు

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 19 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు మంజూరు చేయగా.. జగన్‌ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 12 లక్షల పెన్షన్లు కూడా కొత్తగా మంజూరు చేయలేదు. పైగా రకరకాల నిబంధనలతో పాత పెన్షన్లకు కత్తెర వేశారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 54.06 లక్షల పెన్షన్లు ఉండేవి. అయితే చంద్రబాబు 39 లక్షలు పెన్షన్లు మాత్రమే ఇచ్చారని, తాము 66 లక్షలకు తీసుకెళ్లామని జగన్‌ పదే పదే అబద్ధాలు చెబుతున్నారు.

ఏప్రిల్‌లో పెన్షన్ల పంపిణీని కావాలనే జాప్యం చేశారు. ఖజానాలో ఉన్న సొమ్మును అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. పింఛన్లకు నిధుల విడుదలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్‌ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నా చర్యలు తీసుకోలేదు. అసలు ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ కక్ష గట్టినట్టు వ్యవహరించారు. ఇప్పుడు అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు.

గతంలో లబ్ధిదారులందరికీ అమలు

ఐదేళ్లలో రూ.200 నుంచి 2 వేలకు పెంపు

కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు

జగన్‌ వచ్చాక కొత్తగా 12 లక్షలలోపే

అదీ పాతవాటిని తొలగించి మంజూరు

రకరకాల నిబంధనల పేరిట 6 లక్షలు కట్‌

3 వేలకు పెంపుపై ‘విడతల వారీ’ డ్రామా

ఇప్పుడూ పింఛన్ల పంపిణీపై కహానీలు

బాధ్యత తనది కాదన్నట్టు సీఎం వైఖరి

బస్సు యాత్రలో పచ్చి అబద్ధాలు

‘వలంటీర్ల’పైనే మొదటి సంతకం చేస్తారట

జగన్‌ దృష్టిలో వారు ఉన్నట్లా? లేనట్లా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘నా అవ్వా తాతలు’ అంటూ ప్రేమ ఒలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్‌ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఏ కోణంలో చూసినా చంద్రబాబు హయాంలోనే అవ్వాతాతలకు మేలు జరిగిందని చెప్పవచ్చు. తెలుగుదేశం హయాంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇచ్చేవారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను ఐదేళ్లలో 2 వేలుకు పెంచారు. కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు చేశారు. సొంతూరిలోనే గాక ఎక్కడైనా పెన్షన్‌ తీసుకునే పోర్టబులిటీ వెసులుబాటు కల్పించారు. వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు నెలల పెన్షన్‌ కలిపి ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కడో దూరప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఎంతో వెసులుబాటు ఉండేది.జగన్‌ ప్రభుత్వం వచ్చాక అంతా ‘రివర్స్‌’. రకరకాల నిబంధనలతో పెన్షన్లలో కోతలు పెట్టారు. కొత్తవి ఇవ్వాలంటే పాతవి తొలగించాల్సిన పరిస్థితి. దాదాపు 4 నుంచి 6 లక్షల పాత పెన్షన్లు కట్‌ చేశారు. పోర్టబులిటీ వెసులుబాటు లేదు. అయితే పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పడం, సొంత డబ్బా కొట్టుకోవడం జగన్‌కు అలవాటుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ అదేతీరు. రాజకీయ స్వార్థంకోసం పింఛన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ, అవ్వాతాతలకు అవస్థలు పెడుతున్నారు.

బాబు హయాంలో ఘనం

జగన్‌ ప్రభుత్వంలో కంటే చంద్రబాబు హయాంలో ఎక్కువ పెన్షన్లు మంజూరు చేశారు. అలాగే పెన్షన్‌ మొత్తాన్ని అధికంగా పెంచారు. అయితే జగన్‌ సర్కారు ఈ విషయంలోనూ అసత్యాలు చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 35.32 లక్షల పింఛన్లు ఇచ్చేవారు. అప్పటి వరకు వృద్ధాప్య, వితంతువులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 ఇచ్చేవారు. 2014 జూన్‌ 19న చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లను ఐదురెట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. 200 పెన్షన్లు ఉన్నవారికి రూ.1000, దివ్యాంగులకు రూ.1500కు పెంచారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు పెన్షన్ల మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు, రూ.1500 పొందుతున్న దివ్యాంగులకు రూ.3 వేలకు పెంచారు. 2019 జనవరి నుంచి అమల్లోకి తెస్తూ రెండు నెలల పెన్షన్లను ఒకేసారి ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 54.06 లక్షలు పెన్షన్లు ఉన్నాయు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 19 లక్షలకు పైగా పెన్షన్లు మంజూరు చేస్తే... జగన్‌ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 లక్షల పెన్షన్లు కూడా కొత్తవి మంజూరు చేయలేదు. అయితే చంద్రబాబు 39 లక్షలు మాత్రమే పెన్షన్లు ఇచ్చారని, తాము 66 లక్షలకు తీసుకెళ్లామని పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. అలాగే పెన్షన్‌ను 3 వేలుకు పెంచుతామన్న హామీ విషయంలోనూ జగన్‌ మాట తప్పారు. అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేయకుండా ఏటా రూ.250 పెంచుతామని మెలిక పెట్టారు. ఆ హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా అవ్వాతాతలను మోసం చేశారు. పెన్షన్‌ మొత్తం పెంపుదల ఆలస్యం కావడంతో ఒక్కో పెన్షన్‌దారుడు రూ.13,500 నష్టపోయారు. పెన్షన్‌దారులకు జగన్‌ సర్కార్‌ రూ.8505 కోట్లు ఎగ్గొట్టేసింది.

జగన్‌ వచ్చాక కోతలు

వైసీపీ ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు రావాలంటే ఉన్న పెన్షన్లను తొలగించేలా పరిస్థితి తయారైంది. ఆరంచెల విధానంతో ఉన్న పెన్షన్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి ఆర్నెల్లకోసారి పెన్షన్లు పొందుతున్న వారిని తొలగించే ప్రక్రియ నిరంతర ప్రక్రియగా మారిందని వాపోతున్నారు. దీంతో పెన్షన్‌దారుల కంటికి నిద్రలేకుండా పోయిందని చెప్తున్నారు. ఆరంచెల విధానంతో సుమారు 4 లక్షల నుంచి 6 లక్షల దాకా పెన్షన్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్కడైనా పెన్షన్‌ తీసుకునే పోర్టబులిటీ వెసులుబాటును కూడా వైసీపీ సర్కార్‌ తొలగించింది. పెన్షన్‌దారులు ఒకటో తేదీన సొంత ఊళ్లలో లేకపోతే ఆ నెల పెన్షన్‌ దూరమైనట్లే. వరుసగా రెండు నెలలు పెన్షన్‌ తీసుకోకపోతే పెన్షన్‌ పూర్తిగా రద్దవుతుంది. దీనివల్ల... నగరాలు, పట్టణాల్లో ఉన్న తమ వారసుల వద్దకు వెళ్లిన వారు లక్ష మంది దాకా పెన్షన్లు కోల్పోయారని అంచనా.

ఆలస్యానికి అసలు కారణం...

విపక్షాలవల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగిందని వైసీపీ చోటా నేతల నుంచి సీఎం దాకా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి... ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీకి ఆలస్యంగా నిధులు విడుదల చేశారు. ఖజానాలో ఉన్న నిధులను బిల్లులు, ఐదేళ్ల క్రితం నాటి బకాయిల చెల్లింపులకు మళ్లించి, ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నాక నిధులు విడుదల చేశారు. జగన్‌ సర్కారు పింఛన్ల పంపిణీని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడంతో పాటు అవ్వాతాతలు ఇబ్బందులు పడేలా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికంతటికీ ప్రతిపక్షాలే కారణమని వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారు.

రాష్ట్ర విభజనకు ముందు వృద్ధులు, వితంతువుల పింఛను రూ.200 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రూ.1000కి పెంచారు. ఆ తర్వాత 1000 నుంచి 2 వేలు చేశారు. ఇక దివ్యాంగుల పింఛను రూ.500 నుంచి రూ.1500లకు, ఆ తర్వాత మూడువేలకు పెంచారు. అదే జగన్‌ పాలనలో ‘రూ.3 వేల పెన్షన్‌’ హామీకి మెలిక పెట్టి, జాప్యం చేస్తూ సాగదీశారు.

సీఎంగా బాధ్యత లేదా?

అవ్వాతాతలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పలేరా?

ఇంటివద్దకే పింఛన్‌ పంపాలని సూచించలేరా?

‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేత తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం. అసలు పింఛన్ల పంపిణీ బాధ్యత తనదికాదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ముందుగా ఎంపిక చేసిన కొందరు వృద్ధులను జగన్‌ తన వద్దకు పిలిపించుకుంటున్నారు. ‘ఇంటికి వచ్చే పింఛన్లు ఇస్తున్నారా? మీరే సచివాలయానికి వెళ్తున్నారా?’ అని అమాయకంగా అడుగుతున్నారు. తమకు ఇంకా పింఛన్లు ఇవ్వలేదని వృద్ధులు సమాధానం చెబితే.. ‘అయ్యయ్యో’ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. వలంటీర్లను చంద్రబాబే తీసేయించారని, ఇంటింటికీ పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారన్నట్టు చెబుతున్నారు. వృద్ధులతో జగన్‌ మాట్లాడిన సంభాషణలను నీలిమీడియా ప్రసారం చేస్తోంది. పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వలంటీర్లను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. వలంటీర్లను వైసీపీ పూర్తిస్థాయిలో తమ రాజకీయ కార్యకలాపాల కోసం వాడుకుంటుండటమే దీనికి కారణం. సహజంగా ఇలాంటి ఆదేశాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే... ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ అత్యవసర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి, ప్రభుత్వ యంత్రాంగానికి తగు సలహాలూ, సూచనలూ, ఆదేశాలూ జారీ చేయొచ్చు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను అందించాలని... వలంటీర్లను పక్కన పెట్టినందున గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతరుల సేవలను వాడుకోవాలని ఆదేశించవచ్చు. కానీ, జగన్‌ దీనిపై సమీక్షించనే లేదు. ‘వలంటీర్లు లేకుంటే ప్రపంచమంతా ఆగిపోతుంది’ అని చెప్పడమే లక్ష్యంగా ఇందులో రాజకీయ ప్రయోజనాన్ని వెతుక్కున్నారు. తాను నియమించిన వలంటీర్ల వ్యవస్థతో పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించినందున ప్రభుత్వ యంత్రాంగమేదీ పనిచేయకూడదనే రీతిలో కక్షకట్టారు.

Updated Date - Apr 06 , 2024 | 09:37 AM