Share News

AP NEWS: జగన్‌కు భారీ షాక్.. కోడి కత్తి శీను విడుదల

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:14 PM

వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం కోడి కత్తితో శీనివాస్ అనే యువకుడు దాడి చేశాడు. ఈ కేసులో అతడికి శుక్రవారం నాడు బెయిల్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను శీను లాయర్లు మీడియాకు వివరించారు.

AP NEWS: జగన్‌కు భారీ షాక్.. కోడి కత్తి శీను విడుదల

విశాఖపట్నం: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం కోడి కత్తితో దాడిచేసి అరెస్టయిన శీనివాస్ శుక్రవారం (ఫిబ్రవరి-09) నాడు బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అనంతరం కోడి కత్తి శ్రీను, అతని లాయర్లు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. జగన్‌పై కోడి కత్తి ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి ఈ కేసును తాను టేకప్ చేశానని శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం తెలిపారు. మానవతా దృక్పథంతో, ఆత్మబంధంతో అతని తరఫున వాదించానని తెలిపారు. శ్రీనివాస్ తనకు సోదరుడు లాంటి వాడని చెప్పారు. శ్రీనివాస్‌కు ఐదుకోట్ల మంది ఆంధ్రులు సెక్యూరిటీగా ఉన్నారని తెలిపారు. అతనికి ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని సలీం తెలిపారు. ఈ కేసులో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కోడి కత్తి శీను ధన్యవాదాలు తెలిపారు.

అసలు కారణమిదే..

వైసీపీ అధినేత, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో ఐదేళ్ల క్రితం శీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేశాక పోలీసులు అతడిని పట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఘటన తర్వాత వైఎస్ జగన్ పెద్ద హంగామానే చేశారు కూడా. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఈ దాడి జరిగినప్పుడు ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని జగన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆఖరికి ఏపీలో తనకు వైద్యం చేయించొద్దని.. తనకు హైదరాబాద్‌లో వైద్యం చేయించాలని జగన్ పెద్ద అలజడే సృష్టించారు. అయితే జగన్‌ను ఆ సమయంలో పోలీసులు హైదరాబాద్ తరలించి వైద్యం చేయించారు. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణ సమయంలో ‘జగన్‌ను సీఎంగా చూడాలన్నదే తన ఆశ.. ఈ దాడి చేస్తే ఎన్ని కల్లో జగన్‌కు సింపతి వస్తుంది’ అని శ్రీనివాస్ తెలిపాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. శీను అనుకున్నట్లుగానే జగన్ సీఎం అయ్యారు. కానీ అతడిని మాత్రం విడుదల చేయించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాడు. గత ఐదేళ్లుగా శీను రాజమండ్రి జైలులోనే మగ్గిపోతున్నాడు.

ఇంత చేసింది జగన్ కోసమైనా తనను బయటకు తీసుకురావడానికి సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియా అడిగినప్పుడల్లా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసేవాడు. మీడియా ప్రశ్నించినప్పుడల్లా జగన్ ఏం సమాధానం చెప్పకుండానే దాటవేసేవారు. అసలు ఈ ప్రశ్న అడిగిన మీడియాపై చిందులు తొక్కేవారు. అయితే ఈ దాడిపై వైసీపీ నేతలు పలు రాజకీయ కారణాలు కూడా జొప్పించారు. దాంతో అతను ఐదేళ్ల నుంచి జైలులోనే మగ్గిపోతున్నాడు. కోర్టుకు ఎన్నిసార్లు జగన్‌ను పిలిచినా అతను మాత్రం పలు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. పలు మార్లు ఏపీ హై కోర్టు ఈ కేసుపై విచారించినా శ్రీనివాస్‌కు మాత్రం బెయిల్ రాలేదు. శీనుకు బెయిల్‌ ఇవ్వాలంటూ తన తల్లి, అన్న నిరవధిక దీక్షకు కూడా దిగారు. వారు దీక్ష చేసిన కూడా జగన్ ప్రభుత్వం కనికరించలేదు. దళిత సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై శీను కోసం పోరాటాలు చేశాయి. ఎట్టకేలకు విశాఖ సెంట్రల్ జైలు నుంచి, బెయిల్‌పై కోడి కత్తి శ్రీనివాస్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయనకు దళిత సంఘాలు ఘన స్వాగతం పలికి జై భీమ్ , న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు. జైలు నుంచి శ్రీనివాస్‌ను తీసుకొని న్యాయవాది శ్రీనివాస్, సలీం, విరసం నాయకుడు బూసి వెంకటరమణ వచ్చారు. న్యాయవాదులు దళిత సంఘాల సమక్షంలో తండ్రి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్‌ను అప్పగించ్చారు.

Updated Date - Feb 09 , 2024 | 09:42 PM