Yarlagadda Venkatarao: వైసీపీ శ్రేణులకు నేను అన్నం పెడితే.. ఆ పార్టీ నాకు సున్నం పెట్టింది
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:55 PM
వైసీపీ ( YCP ) శ్రేణులకు తాను అన్నం పెడితే, ఆ పార్టీ తనకు సున్నం పెట్టిందని గన్నవరం తెలుగుదేశం ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ( Yarlagadda Venkatarao ) ఎద్దేవా చేశారు.
![Yarlagadda Venkatarao: వైసీపీ శ్రేణులకు నేను అన్నం పెడితే.. ఆ పార్టీ నాకు సున్నం పెట్టింది](https://media.andhrajyothy.com/media/2023/20231205/Yarlagadda_Venkatarao_f4dfd01185.jpg)
అమరావతి: వైసీపీ ( YCP ) శ్రేణులకు తాను అన్నం పెడితే, ఆ పార్టీ తనకు సున్నం పెట్టిందని గన్నవరం తెలుగుదేశం ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ( Yarlagadda Venkatarao ) ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు ఉండవల్లిలో యువనేత లోకేష్ని కలిశారు. ఈ భేటీలో కృష్ణా జిల్లాలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ నుంచి తన పాత మిత్రులెందరో తెలుగుదేశంలో చేరేందుకు తనని సంప్రదిస్తున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆచి తూచి ముందుకెళ్లామని తనతో లోకేష్ అన్నారని వెంకట్రావు చెప్పారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ బాగు కోసం తనలా తెలుగుదేశంలో ఉండటమే సబబని తన పాత వైసీపీ మిత్రులంతా ఆలోచిస్తున్నారని చెప్పారు.
అందువల్లే వైసీపీకి నేడు ఆ పరిస్థితి
ప్రజల నాడి తెలుసుకున్న వైసీపీ నేతలు తనతో చాలా బాధలు చెప్పుకుంటున్నారన్నారు. 1994 ప్రభంజనం పునరావృతం అయ్యేలా ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితి ఉందన్నారు. 1989లో తెలుగుదేశం గెలిచింది రెండు ఎంపీ స్థానాలే అయినా.. 1994లో ఏం జరిగిందో చరిత్ర చెబుతోందన్నారు. రౌడీ షీటర్లు, చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో పనికి రాని మంత్రులను పెట్టుకోవటం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై ఓ మంత్రి తన అనుచరులతో దాడిచేశారని.. ఆ మంత్రి తన శాఖకు సంబంధించిన విషయాలపై ఏమైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలెవ్వరికీ అర్ధం కావట్లేదని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.