Share News

AP Elections: రఘురామకు పశ్చిమలో సీటు!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:54 AM

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్‌ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.

AP Elections: రఘురామకు పశ్చిమలో సీటు!

  • టీడీపీ నాయకత్వం నిర్ణయం

  • అసెంబ్లీ బరిలో నిలిపే యోచన?

  • ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా మాగుంటే

  • ఢిల్లీ మద్యం కేసు తీవ్రత నేపథ్యంలో

  • పోటీకి ఆయన కుమారుడు దూరం

  • కడప రేసులో శ్రీనివాసరెడ్డి, భూపేశ్‌రెడ్డి?

  • అనంతపురంలో పలు పేర్ల పరిశీలన

  • ‘విజయనగరం’ ప్రతిపాదనలో

  • కళా, మీసాల గీత, అప్పలనాయుడు!

  • మడకశిర, సూళ్లూరుపేట, గజపతినగరం

  • అసెంబ్లీ అభ్యర్థులకు అసమ్మతి పోటు

  • వారి పేర్లపై అధిష్ఠానం పునరాలోచన?

అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు (Raghurama Krishnam Raju) బీజేపీ టికెట్‌ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని భావిస్తోంది. వాస్తవానికి ఆయనకు నరసాపురం లోక్‌సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి. ఆ దిశగా ముందుగానే సంకేతాలు వచ్చాయని తెలిపాయి. కానీ చివరకు ఆ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించింది. రఘురామరాజుకు సీటు దక్కకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో తామే టీడీపీ తరఫున టికెట్‌ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్‌సభ స్థానంలో పోటీచేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా ఈ యోచన ఉపయుక్తం కాదని.. పార్టీకి ఇబ్బంది అవుతుందని అన్నట్లు తెలిసింది. చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామ రాజును నిలిపితే ఎలా ఉంటుందన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారు.

మేక శరణ్‌ పాత్ర ఏంటి?


రాఘవరెడ్డి కాదు.. శ్రీనివాసులరెడ్డే..

ఒంగోలు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మారారు. తన కుమారుడు రాఘవరెడ్డి బదులు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డే బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు తీవ్రత పెరగడంతో.. మొదట ఖరారుచేసిన రాఘవరెడ్డిని కాదని.. ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని నిలపాలని తాజాగా నిర్ణయించారు. ఈ కేసులో రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. పోటీ నుంచి తప్పుకొంటున్నానని ఆయన సోమవారం బహిరంగంగా ప్రకటించారు కూడా. కాగా.. టీడీపీ నాయకత్వం ఇంకా విజయనగరం, కడప, అనంతపురం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కడపకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా తాజాగా జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, ప్రొఫెసర్‌ రాజేశ్‌, కంబూరి నాగరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం ఎంపీ స్థానానికి కొందరు నేతలు మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు పేరు ప్రతిపాదించగా.. మరి కొందరు నేతలు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ముందుకు తెచ్చారు. ఎచ్చెర్ల నేత కలిశెట్టి అప్పలనాయుడు పేరు కూడా వినిపిస్తోంది.

రాసిస్తా రాయలసీమ!


వారిని మారుస్తారా?

ఇప్పటికే ప్రకటించిన ఇద్దరు ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థులపై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా మడకశిర(ఎస్సీ) స్థానానికి తొలుత అనిల్‌ పేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం తీవ్రంగా విభేదిస్తోంది. దీంతో ఆ సీటుకు పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు పేరు తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతినగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్‌ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవడం లేదు. తాజాగా ఈ సీటుకు కళావెంకట్రావు పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట (ఎస్సీ) అభ్యర్థినిగా డాక్టర్‌ నెలవల విజయశ్రీ పేరు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం ఆమె తండ్రి. ఆయనతో వస్తున్న తలనొప్పులతో ఆ సీటుపై కూడా పునరాలోచన జరుగుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి పనితీరుపై కూడా పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. కర్నూలు జిల్లాలో ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. బీజేపీ నేతలు ఇందుకు సుముఖత చూపడం లేదు. ఆదోనిలో బీజేపీ పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్‌ను ఖరారుచేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయంపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని టీడీపీలో కొన్ని వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి.

ఇండిపెండెంట్‌గా గెలిపించుకుంటాం: బాలకోటయ్య

విజయవాడ(ధర్నాచౌక్‌), మార్చి 25: ‘నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేసినా మేం ఆయనకు అండగా ఉండి గెలిపిస్తాం. వైసీపీ అప్రజాస్వామిక పాలనా విధానాలు, సీఎం జగన్‌పై ప్రాణాలొడ్డ్డి పోరాడిన ఏకైక నాయకుడు త్రిబుల్‌ ఆర్‌’ అని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. సోమవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘రఘురామకు ఎంపీ సీటు ఇవ్వడానికి కూటమిలోని మూడు పార్టీలకు ఎందుకు చేతులు రావడం లేదు? ఆయనకు సీటు ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఇంద్రధనస్సును మించిన రంగుల్లో కనిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపులు కొంత గందరగోళంగా, నిరాశ నిస్పృహలతో ఉండటం చాలా మందిని బాధిస్తోంది’ అని బాలకోటయ్య అన్నారు. నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు, రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శిరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 08:09 AM