Share News

TDP: టీడీపీకి కీలక నేత రాజీనామా.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్న మరో ముగ్గురు..!

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:14 AM

టీడీపీ టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చురేపింది. చీపురుపల్లి టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేశారు..

TDP: టీడీపీకి కీలక నేత రాజీనామా.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్న మరో ముగ్గురు..!

  • ప్రభాకర్‌ చౌదరి, జితేంద్రగౌడ్‌ వర్గీయుల ఆందోళన

  • పార్టీ పదవులకు నాగార్జున రాజీనామా

  • టికెట్‌ కోసం కుటుంబంతో సహా రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి

అనంతపురం అర్బన్‌/గుంతకల్లు/చీపురుపల్లి/అనపర్తి, మార్చి 29: టీడీపీ (TDP) టికెట్ల కేటాయింపు ఆ పార్టీలో చిచ్చురేపింది. చీపురుపల్లి టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున (Kimidi Nagarjuna) పార్టీ పదవులకు రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కారు. అనంతపురం జిల్లాలో అనంత అర్బన్‌, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జితేంద్రగౌడ్‌కు టికెట్లు దక్కకపోవడంతో వారి వర్గీయులు ఆందోళనలకు దిగారు. శుక్రవారం అనంతపురం అర్బన్‌ టీడీపీ కార్యాలయం ఎదుట ప్రభాకర్‌ చౌదరి వర్గీయులు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను దహనం చేశారు. అనంతరం రాంనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకుని తాళాలను బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. సామగ్రిని బయటకు తీసుకొచ్చి దహనం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఇంటి ఎదుట తెలుగు మహిళలు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఆ సమయంలో ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. ప్రభాకర్‌ చౌదరికి టికెట్‌ రాలేదని మనస్తాపానికి గురైన ఇద్దరు కార్యకర్తలు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న పార్టీ శ్రేణులు వారిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అనంతపురం అర్బన్‌లో 12మంది క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, 50మంది డివిజన్‌ అధ్యక్షులు, 57మంది యూనిట్‌ ఇన్‌చార్జిలు, 277 మంది బూత్‌ ఇన్‌చార్జిలు టీడీపీకి రాజీనామా చేశారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ గుమ్మనూరు జయరాంకు ఖరారు కాగానే ఆయన వర్గీయులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో జితేంద్రగౌడ్‌ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీ కార్యాలయంలోని కుర్చీలను, కరపత్రాలను రోడ్డుపై వేసి నిప్పుపెట్టారు. చంద్రబాబు చిత్రపటాన్ని తగులబెట్టారు. జయరాంను ఓడిస్తామని శపథం చేశారు. తన వర్గీయులతో మూడు నాలుగు రోజుల్లో సమావేశమై, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని జితేంద్రగౌడ్‌ తెలిపారు.

Anantapur-Prabhakar-Ch.jpg

పార్టీ నమ్మించి గొంతు కోసింది: నాగార్జున

ఐదేళ్లపాటు సేవలందించిన తనకు టీడీపీ నమ్మించి ఆశలు చూపించి చివరికి గొంతు కోసిందని ఆ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తనను తప్పించి చీపురుపల్లి అసెంబ్లీ టికెట్‌ వేరే వారికి ప్రకటించడం శోచనీయమన్నారు. జిల్లా అధ్యక్ష, నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులకు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. నాగార్జునకు టికెట్‌ నిరాకరించినందుకు చీపురుపల్లిలో కార్యకర్తలు పార్టీ కరపత్రాలను దహనం చేశారు. చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

NallaMalli.jpg

42 ఏళ్లుగా సేవలందించాం: నల్లమిల్లి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీలో అసమ్మతి సెగలు చల్లారలేదు. తొలి జాబితాలో టీడీపీ, జనసేన అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. అయితే పొత్తు నేపథ్యంలో బీజేపీకి ఆ సీటును కేటాయించారు. ఈ నేపథ్యంలో అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికే కేటాయించాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు. నల్లమిల్లితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినా మంటలు చల్లారలేదు. సీనియర్‌ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ్‌ కృష్ణ రంగారావు, గన్ని కృష్ణ శుక్రవారం నల్లమిల్లి నివాసానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి తల్లి సత్యవతి మాట్లాడుతూ.. తమను నమ్మించి మోసంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 42ఏళ్లుగా పార్టీని నమ్ముకుని అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన తమ కుటుంబానికి ఇలా చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. విజయవాడ వచ్చి అధినేతతో మాట్లాడాలని నేతల బృందం నల్లమిల్లికి సూచించారు. అయితే తాను ఇప్పటికే ప్రజాభిప్రాయం కోసం ఐదు రోజుల పాటు కుటుంబంతో కలిసి పర్యటిస్తానని మాటిచ్చానని, తాను ప్రస్తుతం అధినేతను కలవలేనంటూ వారి ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Updated Date - Mar 30 , 2024 | 08:15 AM