YS Sharmila: కవిత, కేసీఆర్‌లను ఏకిపారేసిన షర్మిల

ABN , First Publish Date - 2023-03-08T12:59:54+05:30 IST

బంగారు తెలంగాణలో ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. సీఎం కేసీఆర్ బిడ్డకే భద్రత ఉందని, కేసీఆర్ బిడ్డకే రక్షణ ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: కవిత, కేసీఆర్‌లను ఏకిపారేసిన షర్మిల

హైదరాబాద్: బంగారు తెలంగాణ (Telangana)లో ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. సీఎం కేసీఆర్ (CM KCR) బిడ్డకే భద్రత ఉందని, కేసీఆర్ (Telangana CM) బిడ్డకే రక్షణ ఉందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఆడదై ఉండి సిగ్గులేకుండా లిక్కర్ స్కాం చేశారని మండిపడ్డారు. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళల గౌరవం కోసం కేసీఆర్ బిడ్డ కొట్లాడుతుందట... అసలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లో మహిళలకు రిజర్వేషన్ ఉందా? ఎంత మంది మహిళలకు ఎమ్మేల్యే టికెట్లు ఇచ్చారు అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇద్దరు మహిళ మంత్రులున్నా వాళ్ళు డమ్మీలని వ్యాఖ్యలు చేశారు. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. తెలంగాణలో విద్యార్థినిలకు బాత్ రూంలు కూడా లేవన్నారు. తెలంగాణలో విద్యార్ధినిలు పీరియడ్స్ రావొద్దని టాబ్లెట్స్ వేసుకుంటున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ తెలిపారు.

షర్మిల ఇంకా మాట్లాడుతూ.. తెలంగాణ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం ఒక్కరోజు మహిళలకు గౌరవం ఇవ్వడం తర్వాత మర్చిపోవడం కేసీఆ‌ర్‌కు అలవాటుగా మారిందన్నారు. ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడే అభివృద్ది జరుగుతుందని.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళ భద్రత గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది కానీ రిపోర్ట్స్ చూస్తే మహిళలపై అత్యాచారాల విషయంలో సౌత్ ఇండియాలో తెలంగాణ టాప్‌లో ఉందని పేర్కొన్నారు. బంగారు తెలగాణలో మద్యం, డ్రగ్స్ ఏరులై పారడం వల్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మహిళలపై దాడుల గురించి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారో చూడాలని అన్నారు.

మహిళలని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని విమర్శించారు. భరోసా యాప్ పత్తా లేకుండా పోయిందని.. అది కాళేశ్వరంలో మునిగిపోయిందా అంటూ నిలదీశారు. మహిళలపై కేసీఆర్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళల పరిస్థితి ల్యాండ్ మైన్‌పై బ్రతుకుతున్నట్టు ఉందన్నారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలే మహిళలను ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. మహిళల భద్రతపై రివ్యూ చేశారా? ఎంక్వైరీ చేశారా అని అడిగారు. డబ్బులున్న వాళ్ళకి ఒక న్యాయం.. సాధారణ ప్రజలకు ఒక న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను అనరాని మాటలన్న వ్యక్తికి బుద్ధి చెప్పాల్సింది పోయి మంచి అవకాశాలు కల్పిస్తారా అని మండిపడ్డారు. ప్రజల పక్షాన మాట్లాడుతుంటే ఎవడెవడో బెదిరించారని.. దాడులు చేశారని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-03-08T12:59:54+05:30 IST