Share News

Chandra Mohan: చంద్రమోహన్‌ మృతిపట్ల ఎన్టీఆర్, బాలయ్య సంతాపం

ABN , First Publish Date - 2023-11-11T12:21:08+05:30 IST

ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.

Chandra Mohan: చంద్రమోహన్‌ మృతిపట్ల ఎన్టీఆర్, బాలయ్య సంతాపం

హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) (Chandramohan) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్ (Junion NTR), బాలకృష్ణ (Balakrishna), మంచు విష్ణు (Manchu Vishnu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh), ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (Atchannaidu), సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) సంతాపం ప్రకటించారు. చంద్రమోహన్ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన చెందారు.


చంద్రమోహన్ అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్

చంద్రమోహన్ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చంద్రమోహన్ అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

హాస్యనటనతో ఆకట్టుకున్న నటుడు చంద్రమోహన్: బాలయ్య

సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పౌరానిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్‌తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అని అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

చంద్రమోహన్ సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు

చంద్రమోహన్ మృతిపట్ల నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రమోహన్ మరణవార్త కలిచివేసిందని ఆవేదన చెందారు. చంద్రమోహన్ అసాధారణ నటుడని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపారు. ‘ఢీ’ సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కిందన్నారు. చంద్రమోహన్ అద్భుతమైన వ్యక్తి అని.. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేదని మంచు విష్ణు ట్వీట్ చేశారు.


చంద్రమోహన్ మృతిపై లోకేష్...

సీనియ‌ర్ న‌టులు చంద్రమోహ‌న్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు.‘‘చంద్రమోహన్ మృతి బాధాక‌రం. హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన న‌టుడు చంద్రమోహ‌న్ గారి మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ‌స‌భ్యుల‌కి నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను’’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

స్వయంకృషితో ఎదిగిన నటుడు చంద్రమోహన్: అచ్చెన్న

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతిపట్ల ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సినీరంగంలో తనదైన ముద్రవేసిన చంద్రమోహన్ 932 చిత్రాల్లో నటించారని.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. సినీరంగంలో తన నటతో తెలుగువారిని అలరించారన్నారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న వ్యక్తి చంద్రమోహన్ అని.. ఆయన మృతి తెలుగుచిత్ర పరిశ్రమకు తీరనిలోటని ఆవేదన చెందారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు అచ్చెన్న్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జనరంజక పాత్రలు పోషించారు: రామకృష్ణ

విలక్షణ నటుడు చంద్రమోహన్ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. 932కు పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన నటుడు చంద్రమోహన్ అని కొనియాడారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా జనరంజక పాత్రలు పోషించారన్నారు. ఫిలింఫేర్, నంది అవార్డులు చంద్రమోహన్ నటనకు మచ్చుతునకలన్నారు. చంద్రమోహన్ మరణం పట్ల రామకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2023-11-11T12:21:10+05:30 IST