IND vs WI 4th T20: చెలరేగిన హెట్‌మేయర్, హోప్.. అర్ష్‌దీప్, కుల్దీప్ సూపర్ బౌలింగ్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!

ABN , First Publish Date - 2023-08-12T21:57:24+05:30 IST

హెట్‌మేయర్(61) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు షాయ్ హోప్(45) రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు వెస్టిండీస్ 179 పరుగుల టఫ్ లక్ష్యాన్ని చేధించింది.

IND vs WI 4th T20: చెలరేగిన హెట్‌మేయర్, హోప్.. అర్ష్‌దీప్, కుల్దీప్ సూపర్ బౌలింగ్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!

ఫ్లోరిడా: హెట్‌మేయర్(61) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు షాయ్ హోప్(45) రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు వెస్టిండీస్ 179 పరుగుల టఫ్ లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్(3/38), కుల్దీప్ యాదవ్(26/2) ఆరంభంలోనే విండీస్‌ను గట్టి దెబ్బతీసినప్పటికీ హెట్‌మేయర్, షాయ్ హోప్ ఆదుకోవడంతో కరేబియన్లు మంచి స్కోర్ సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో మన ఫీల్డర్లు అదరగొట్టారనే చెప్పుకోవాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు కైల్ మేయర్స్(17), బ్రాండన్ కింగ్(18)ను అర్ష్‌దీప్ సింగ్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. శాంసన్ సూపర్ క్యాచ్‌తో మేయర్స్, కుల్దీప్ సూపర్ క్యాచ్‌తో బ్రాండన్ కింగ్ ఔటయ్యారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 7వ ఓవర్‌లో కీలక బ్యాటర్లైనా నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్‌ను 5 బంతుల వ్యవధిలో ఔట్ చేశాడు. వారిద్దరు ఒక్కో పరుగు చొప్పున మాత్రమే చేశారు. దీంతో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విండీస్‌ను షాయ్ హోప్, షిమ్రోన్ హెట్‌మేయర్ ఆదుకున్నారు. జట్టు స్కోర్‌ను 100 పరుగులు దాటించడమే కాకుండా ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 49 పరుగులు జోడించారు. అయితే ఈ పాట్నర్‌షిప్‌ను 13వ ఓవర్‌లో లెగ్ స్పిన్నర్ చాహల్ విడదీశాడు. 3 ఫోర్లు, 2 సిక్సులతో 29 బంతుల్లోనే 45 పరుగులు చేసిన షాయ్ హోప్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 106 పరుగులకు కరేబియన్లు సగం వికెట్లు కోల్పోయారు.


రొమారియో షెపర్డ్(9), జేసన్ హోల్డర్(3)ను సింగిల్ డిజిట్‌లకే అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చారు. దీంతో 15.3 ఓవర్లలో విండీస్ 123 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హెట్‌మేయర్ మాత్రం ఒంటరిపోరాటం చేశారు. ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ 35 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో హెట్‌మేయర్‌కు ఇది 5వ హాఫ్ సెంచరీ. అయితే హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడుతున్న హెట్‌మేయర్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూపర్ ఫీల్డింగ్‌తో అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. హెట్‌మేయర్ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ వర్మ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరి అద్భుతంగా అందుకున్నాడు. కాగా హెట్‌మేయర్ 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అయితే చివరి ఓవర్‌లో హెట్‌మేయర్, స్మిత్ చెరో సిక్సు, హోసేన్ ఓ ఫోర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో విండీస్ 57 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, చాహల్, ముఖేష్ కుమార్ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-08-12T21:57:24+05:30 IST