Share News

IND vs AUS: కొంపముంచిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వైఫల్యం.. భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే!

ABN , First Publish Date - 2023-11-29T07:37:48+05:30 IST

Suryakumar Yadav: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్‌ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు.

IND vs AUS: కొంపముంచిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వైఫల్యం.. భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే!

గువాహటి: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్‌ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు. సూర్యకుమార్ యదవ్ కెప్టెన్సీ వైఫల్యం, ఫీల్డింగ్ వైఫల్యం, డెత్ ఓవర్లలో బౌలర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు సాధించి మరో 2 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఆశించిన టీమిండియాకు నిరాశే ఎదురైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వైఫల్యమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని వారు చెబుతున్నారు. 19వ ఓవర్‌ను పేసర్లతో కాకుండా స్పిన్నర్ అక్షర్ పటేల్‌తో వేయించడం వల్లనే మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేసిందని చెబుతున్నారు.


నిజానికి అక్షర్ పటేల్ అంతకుముందు చక్కగా బౌలింగ్ చేశాడు. మొదటగా 9వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఆ ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చాడు. 11వ ఓవర్‌లో 6 పరుగులు, 13వ ఓవర్‌లో 10 పరుగులిచ్చి ఓ వికెట్ కూడా తీశాడు. మొదటి 3 ఓవర్లలో అక్షర్ 19 పరుగులే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు. దీంతో ఆసీస్ స్కోర్ బోర్డు కాస్త మందగించింది. అయితే అక్షర్‌కు వరుసగా 3 ఓవర్లు బౌలింగ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ అలాగే నాలుగో ఓవర్ కూడా ఇచ్చి అప్పుడే కోటా పూర్తి చేయించి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అంటున్నారు. లేదంటో రెండు, మూడు ఓవర్ల తర్వాత వేయించాల్సిందని చెబుతున్నారు. కానీ అలా కాకుండా కీలకమైన 19వ ఓవర్ బౌలింగ్ చేయించడం టీమిండియాకు మైనస్‌గా మారిందని అంటున్నారు. డెత్ ఓవర్లలో స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వడమే ప్రమాదం. అలాంటిది కీలకమైన 19వ ఓవర్ ఇవ్వడం టీమిండియా ఓటమికి కారణమైందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే డెత్ ఓవర్లలో స్పిన్నర్లను ఆడడం బ్యాటర్లకు సులభంగా ఉంటుంది. కాగా స్పిన్నర్ అక్షర్ పటేల్ 19వ ఓవర్ బౌలింగ్ చేయడాన్ని ఆసీస్ బ్యాటర్ మాథ్యూ వేడ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అప్పటివరకు బాల్ టూ బాల్ ఆడిన వేడ్ ఆ ఓవర్లో 2 ఫోర్లు, ఓ సిక్సు బాదాడు. ఇషాన్ కిషన్ కీపింగ్ వైఫల్యంతో లెగ్‌బైస్‌లో మరో బౌండరీ లభించింది. దీంతో ఆ ఓవర్ మొత్తం మీద 22 పరుగులొచ్చాయి. చివరి 2 ఓవర్లలో 43 పరుగులుగా ఉన్న సమీకరం చివరి ఓవర్లో 21 పరుగులకు తగ్గిపోయింది. 19వ ఓవర్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో వేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రెండో కారణం విషయానికొస్తే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ వదిలేశాడు. ఆ క్యాచ్ సూర్య పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక మూడో కారణం విషయానికొస్తే బౌలర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచింది. 13.3 ఓవర్లలో 134 పరుగులకే సగం వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు ఆ తర్వాత మళ్లీ వికెట్ తీయలేకపోయారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్, వేడ్ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. దీంతో వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 39 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. డెత్ ఓవర్లలో అయితే మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అలాగే 18వ ఓవర్లో 6 పరుగులే ఇచ్చిన ప్రసిద్ క‌ృష్ణ చివరి ఓవర్లో మాత్రం ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు, ఓ సిక్సు ఇచ్చాడు. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌లో చేసిన తప్పులను తర్వాతి మ్యాచ్‌లో పునరావృతం కానివ్వకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ పరుగులను కట్టడి చేయడంలో మెరుగుపడాలని చెబుతున్నారు. కాగా మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చివరి బంతికి చేధించింది. అజేయ సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్ ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Updated Date - 2023-11-29T07:37:51+05:30 IST