Share News

World Cup: మైల్‌ స్టోన్ రికార్డుకు 93 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2023-10-22T12:21:49+05:30 IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైల్ స్టోన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరొక 93 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.

World Cup: మైల్‌ స్టోన్ రికార్డుకు 93 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

ధర్మశాల: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైల్ స్టోన్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరొక 93 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్(34,357), విరాట్ కోహ్లీ (26,026), రాహల్ ద్రావిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433) ఈ మైలురాయిని చేరుకున్నారు. మొత్తంగా 20వ ఆటగాడిగా నిలుస్తాడు. దీంతో ఈ ఘనతను రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనే అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 52 టెస్టులు, 255 వన్డేలు, 148 టీ20లు ఆడిన రోహిత్ శర్మ అన్నింట్లో కలిపి 17,907 పరుగులు చేశాడు. అందులో టెస్టుల్లో 46 సగటుతో 3,677 పరుగులు.. వన్డేల్లో 49 సగటుతో 10,377 పరుగులు.. టీ20ల్లో 30 సగటుతో 3,853 పరుగులు చేశాడు. మొత్తంగా 45 సెంచరీలు, 98 హాఫ్ సెంచరీలు చేశాడు. నాలుగు సార్లు డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అందులో వన్డేల్లోనే 3 డబుల్ సెంచరీలు కొట్టాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264గా ఉంది.


ఇక మ్యాచ్ విషయానికొస్తే వన్డే ప్రపంచకప్‌లో సమవుజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీల్లో కివీస్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయిన భారత్ ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రెండు జట్లను గాయాలు ఇబ్బందిపెడుతున్నాయి. గాయాల కారణంగా టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అలాగే రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ కూడా స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు. ఇషాన్ కిషన్‌ను తేనే టీగ కుట్టింది. దీంతో వీరు ముగ్గురు ఆడతారా? లేదా? అనేది మ్యాచ్ సమయానికి గానీ స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.

Updated Date - 2023-10-22T13:08:30+05:30 IST