Asian Games: చైనాకు బయల్దేరిన టీమిండియా.. గోల్డ్ మెడల్ తెస్తుందా?..

ABN , First Publish Date - 2023-09-28T16:04:54+05:30 IST

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా షూటింగ్‌లో మనవాళ్లు అదరగొట్టారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 6 స్వర్ణ పతకాలు గెలిస్తే.. అందులో 4 స్వర్ణాలు షూటర్లే గెలిచారు.

Asian Games: చైనాకు బయల్దేరిన టీమిండియా.. గోల్డ్ మెడల్ తెస్తుందా?..

హాంగ్జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా షూటింగ్‌లో మనవాళ్లు అదరగొట్టారు. ఇప్పటివరకు భారత ఆటగాళ్లు 6 స్వర్ణ పతకాలు గెలిస్తే.. అందులో 4 స్వర్ణాలు షూటర్లే గెలిచారు. అయితే పతకాల వేటలో ఇక భారత క్రికెట్ జట్టు వంతు వచ్చేసింది. క్రికెట్‌లో ఇప్పటికే అమ్మాయిలు గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక భారత పురుషుల జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి నేడు చైనాకు బయలుదేరింది. ముంబై నుంచి నేరుగా ఏషియన్ గేమ్స్ జరిగే హాంగ్జౌకు టీమిండియా ఆటగాళ్లు చేరుకుంటారు. భారత జట్టు నేడు సాయంత్రం అక్కడికి చేరుకుంటుంది. శుక్రవారం నుంచి భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. కాగా ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ టోర్నీలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ నుంచి బరిలోకి దిగనుంది. భారత్‌తోపాటు ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు కూడా నేరుగా క్వార్టర్ ఫైనల్‌లో ఆడనున్నాయి. అంటే ఆసియా క్రీడల్లో టీమిండియా ప్రయాణం అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానుంది.


టీమిండియా స్క్వాడ్

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభు సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

Updated Date - 2023-09-28T16:04:54+05:30 IST