Bhogapuram airport: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్పై జగన్ వ్యాఖ్యలు ఇవే.. సర్వత్రా చర్చనీయాంశం
ABN , First Publish Date - 2023-05-03T16:28:08+05:30 IST
కొట్టిన చోటే మళ్లీ టెంకాయలు పగిలాయి! ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఇంత హడావుడిగా భోగాపురం ఎయిర్పోర్ట్ (Bhogapuram airport), అదానీ-వైజాగ్ డేటా సెంటర్లకు (Adani-Vizag data centre) భూమి పూజలు మొదలుపెట్టిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకు కారణాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం...
‘‘ విశాఖ ఎయిర్పోర్టులో ఈగలు తోలుకుంటున్నారు. మళ్లీ దగ్గరలోనే కొత్త ఎయిర్పోర్టు ఎందుకో, ఈ దిక్కుమాలిని ఆలోచన ఏంటో అర్థంకావడం లేదు’’.. భోగాపురం ఎయిర్పోర్టు గురించి ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఈ రోజు అదే ఎయిర్పోర్టుకు భూమిపూజ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy). ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ముందు మొదలుపెట్టారంటూ టీడీపీని విమర్శించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయింది. ఇన్నాళ్లు ఏ ఊలుకూ లేదు పలుకూ లేదు. అభివృద్ధి కార్యక్రమాల ఊసే లేదు. కానీ సరిగ్గా ఇంకో ఏడాదిలో ఎన్నికలనగా శంకుస్థాపనలు మొదలయ్యాయి!. నాలుగేళ్లక్రితం ఆగిపోయిన పనులు సడన్గా తెరమీదకు వచ్చేశాయి. కొట్టిన చోటే మళ్లీ టెంకాయలు పగిలాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఇంత హడావుడిగా భోగాపురం ఎయిర్పోర్ట్తోపాటు (Bhogapuram airport) అదానీ-వైజాగ్ డేటా సెంటర్లకు (Adani-Vizag data centre) భూమి పూజలు మొదలుపెట్టిన తీరు చూస్తుంటే ఎవరికైనా ‘ఎన్నికల స్టంట్’ అనే భావన కలగక మానదు. అందుకు కారణాలు ఏంటో పరిశీలిద్దాం..
ఒకే ప్రాజెక్ట్కు రెండోసారి శంకుస్థాపన..
ఎప్పుడో నాలుగేళ్లక్రితం మరుగున పడిన ఈ 2 ప్రాజెక్టులను ఎన్నికల ముందు మళ్లీ కొత్తగా తెరపైకి తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చనీయాంశమైంది. పొలిటికల్ సర్కిల్స్లో ఈ అంశమే హాట్టాపిక్గా మారిపోయింది. ఈ రెండు శంకుస్థాపనలపై ఈ స్థాయి ఫోకస్కు కారణాలు ఏంటి?. ఈ విషయంలో వైసీపీ సర్కారును విపక్ష పార్టీలు ఎందుకు ఎద్దేవా చేస్తున్నాయి?. అసలు నాలుగేళ్లక్రితం ఏం జరిగింది?.. తెలియాలంటే పూర్వవివరాల్లో వెళ్లాల్సిందే... ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరగడం ఇది రెండోసారి. అవునా..! అని ఆశ్చర్యపోకండి. నాలుగేళ్లక్రితమే టీడీపీ హయాంలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి భూమిపూజతో పనులు మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు ఆగిపోయాయి. నాలుగేళ్లపాటు ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కనపెట్టింది. భూసేకరణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా హడావుడిగా శంకుస్థాపన చేసింది.
నిజానికి ఈ ప్రాజెక్టును ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేది గంటా శ్రీనివాస రావు కోసం, అయ్యన్న కోసం, అవంతి శ్రీనివాస్ కోసం అని నిందలు వేశారు. తీరాచూస్తే ఇప్పుడు అవంతి శ్రీనివాస రావు వైసీపీలోనే ఉన్నారు. ఇదే విషయాన్ని ఎత్తిచూపి భోగాపురం ఎవరి కోసం కడుతున్నారని ప్రశ్నిస్తే జగన్ ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అంతేకాదు చంద్రబాబు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని కూడా జగన్ ఆ నాడు తప్పుబట్టారు. మరి జగన్ కూడా ఎన్నికలకు ఏడాది ముందే కదా భూమిపూజ చేసింది అనే సూటి ప్రశ్నలు వస్తున్నాయి. అవసరమైతే కోర్టుకు పోదాం.. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుందని, బలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇచ్చేస్తామని ఆ నాడు జగన్ హామీలు ఇచ్చారని, మరి ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదానీ డేటా సెంటర్ కూడా ఇంతే..
విశాఖపట్నంలో జగన్ శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కూడా కొత్తది కాదు. టీడీపీ హయాంలోనే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కానీ జగన్ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పేచీ పెట్టి ఆ ఒప్పందాలను రద్దు చేసింది. కొత్తగా మళ్లీ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను అప్పన్నంగా కట్టబెట్టింది. కనీసం పునాదిరాయి కూడా వేయకుండానే అదనంగా మరిన్ని భూములు కేటాయించింది. మధురవాడలో ఒక కొండ మొత్తం ధారాదత్తం చేసింది. ఎప్పుడో ఒప్పందం జరిగితే.. విశాఖలో అదానీ డేటా సెంటర్కు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా నాలుగేళ్లపాటు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తే ఈ ప్రాజెక్టులు పూర్తయిపోతాయా?. నిధులులేమి నానా అగచాట్లు పడుతున్న ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్టులను నిర్మిస్తుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే ఎన్నికల స్టంట్ కాకపోతే మరేంటి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి...