AP Politics: ఏపీలో పొత్తు పాలిటిక్స్‌పై హాట్‌హాట్‌గా చర్చ.. జనసేన చుట్టే రాజకీయం ఎందుకు తిరుగుతోందంటే..

ABN , First Publish Date - 2023-01-25T13:54:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల (AP Elections) నాటికి ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? జగన్‌ను (Jagan) గద్దె దించేందుకు ఏఏ పార్టీలు పొత్తుకు..

AP Politics: ఏపీలో పొత్తు పాలిటిక్స్‌పై హాట్‌హాట్‌గా చర్చ.. జనసేన చుట్టే రాజకీయం ఎందుకు తిరుగుతోందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రానున్న అసెంబ్లీ ఎన్నికల (AP Elections) నాటికి ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? జగన్‌ను (Jagan) గద్దె దించేందుకు ఏఏ పార్టీలు పొత్తుకు సమాయత్తం అవుతున్నాయి..? జనసేనతో (Janasena) పొత్తు అంటూనే వైసీపీ, టీడీపీలకు దూరంగా ఉంటామని ఏపీ బీజేపీ (AP BJP) నేతలు చెప్పడంలో అంతరార్థం ఏమిటి..? కొండగట్టు అంజన్న (Kondagattu Temple) సాక్షిగా ఏపీలో బీజేపీతో కలిసే పోటీ అని జనసేనాని క్లారిటీ ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి..? ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది..? టీడీపీతో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయి..? జనసేన, టీడీపీ మాత్రమే పొత్తుతో ముందుకెళితే ఏమేర ప్రభావం ఉంటుంది..? జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు సిద్ధమైతే వైసీపీ పరిస్థితి ఏంటి..? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నడుస్తున్న పొత్తుల రాజకీయంపై ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయ పార్టీల సమీకరణాలు తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు. పొత్తులపై ఓటర్లను గందరగోళంలోకి నెట్టేసేలా ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు కారణం. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలిపోకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. పొత్తులపై మాత్రం జనసేనాని పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదు. ‘ఏపీలో ప్రస్తుతానికి జనసేన పార్టీకి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తాం.. కాదంటే ఒంటరిగానైనా వెళ్తాం.. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తాం’ కొండగట్టు అంజన్న సాక్షిగా ఏపీలో పొత్తులపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. పొత్తులకు సంబంధించి పవన్ గతంలో చేసిన మూడు ఆప్షన్ల ఫార్ములాకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. బీజేపీతో కలిసి, బీజేపీ-టీడీపీతో కలిసి.. చివరి ఆప్షన్ ఒంటరిగా పోటీ చేయడం.

జనసేనాని గతంలో చెప్పిన మూడు ఆప్షన్లు ఇవి. ఈ ఆప్షన్లను ప్రకటించిన సందర్భంలో పవన్ మరో కీలక వ్యాఖ్య కూడా చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘‘2014లో తగ్గాను. 2019లోనూ తగ్గాను. 2024లో మాత్రం తగ్గేందుకు సిద్ధంగా లేను. రాష్ట్రం కోసం అన్నిసార్లు నేను తగ్గాను. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందనుకుంటున్నాను. తమను తాము తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అనే బైబిల్ సూక్తిని టీడీపీ నేతలు గ్రహించాలి’’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. పొత్తుకు ప్రతిఫలంగా పవన్ భారీగానే జనసేనకు టికెట్లు ఆశిస్తున్నారని ఈ వ్యాఖ్యలతో స్పష్టమైంది. అయితే ఎన్ని స్థానాలనేది పొత్తు పొడిచాక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక.. ఏపీ బీజేపీ విషయానికొస్తే పవన్ మూడు ఆప్షన్లు ప్రకటించిన సందర్భంలో.. మొదటి ఆప్షన్‌నే తీసుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ ఫార్ములాపై స్పందించిన విషయం విదితమే. భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కూడా ఇదే విషయం మరోసారి తేటతెల్లమైంది.

వైసీపీ, టీడీపీలకు ప్రత్నామ్నాయంగా బీజేపీని నిలిపి.. ఎన్నికలకు వెళ్తామని, కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని కార్యవర్గ సమావేశాల్లో ఏపీ బీజేపీ తీర్మానించింది. టీడీపీ, వైసీపీలతో కాకుండా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో ముందుకెళతామని కూడా ఏపీ బీజేపీ తీర్మానించింది. ఈ తీర్మానం ద్వారా జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధమే కానీ.. టీడీపీతో పొత్తుకు మాత్రం ఏపీ బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు కొనసాగుతారని భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేమని ఏపీ బీజేపీ చేసిన ప్రకటన బీజేపీ హైకమాండ్ నిర్ణయమేనని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సోము వీర్రాజు నాయకత్వంపై ఏపీ బీజేపీ నేతలు కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

కన్నా లక్ష్మీనారాయణతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరవడం కమల శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సిద్ధాంతాలు, నియమావళితో సంబంధం లేకుండా ఎప్పుడు ఎవరిని వద్దనుకుంటే వారిని సస్పెండ్‌ చేయడం, తనకు నచ్చనివారిని పదవి నంచి తప్పించడం మొదలుపెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... పార్టీ పదవుల్లో నియమించే వారి గురించి కనీస సమాచారం కోర్‌ కమిటీకి కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. సోము వీర్రాజు నాయకత్వంపైనే కాదు పొత్తుల విషయంలో కూడా ఏపీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.

జనసేన, టీడీపీతో కలిసి వెళితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఏపీ బీజేపీలోని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. అందువల్ల.. పొత్తులపై కార్యవర్గ సమావేశాల్లో చేసిన తీర్మానాన్నే ఫైనల్ అని భావించలేమని ఈ పరిణామాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి యువనేత లోకేష్ పాదయాత్రపైనే టీడీపీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. మొత్తంగా చూసుకుంటే.. ఏపీలోని ప్రధాన పార్టీలకు, మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీకి పొత్తుల విషయంలో ఇప్పటికైతే స్పష్టమైన వైఖరి లేదని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

Updated Date - 2023-01-25T13:55:35+05:30 IST