Gulf News: సౌదీలో మూత పడ్డ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది భారతీయులకు తెలుగు ప్రవాసుల ఆపన్నహస్తం..!

ABN , First Publish Date - 2023-05-17T16:16:10+05:30 IST

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ భారతీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు.

Gulf News: సౌదీలో మూత పడ్డ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది భారతీయులకు తెలుగు ప్రవాసుల ఆపన్నహస్తం..!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒకరిద్దరు కాదు ఏకంగా 150 మంది ప్రవాసులు ఒకేసారి రోడ్డున పడ్డారు. కుటుంబ కష్టాలను తీర్చేందుకు సౌదీ అరేబియా దేశానికి వస్తే.. వాళ్లే కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయారు. అప్పటి వరకు తమకు జీవితాన్ని, జీతాన్ని ఇస్తోందనుకున్న కంపెనీ ఉన్నట్టుండి మూతపడటంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటికప్పుడు తిరిగి సొంతూళ్లకు వెళ్లలేక.. సౌదీలోనే ఉంటూ మరో ఉద్యోగాన్ని వెతుక్కునే వరకు తినడానికి తిండి లేక అలమటిస్తోంటే.. సాటి ప్రవాసులు చలించిపోయారు. తోటి భారతీయుల కష్టాలను చూసి అండగా తామున్నామంటూ ఆపన్నహస్తం అందించారు.

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది ప్రవాసులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ ప్రవాసీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు. తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్, ప్రముఖ సామాజిక సేవకుడు పోకూరి ఆనంద్‌ల అధ్వర్యంలో తెలుగు ప్రముఖులు చిట్లూరి రంజీత్, జి. ఆనందరాజు, కొరపోలు సూర్య, శ్రీనివాస రెడ్డి, నగేశ్, లక్ష్మణ్, చంద్ర, అమ్మిరెడ్డి మరియు ప్రవీణ్‌లు కలిసి నగరంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీల సహాయంతో వీరికి తమవంతుగా సహాయం అందించారు.

Saudi-2.jpg

వాస్తవానికి కొంతకాలంగా తెలుగు కుటుంబాలు ఈ కార్మికులకు తమకు వీలయిన విధంగా వ్యక్తిగత రూపంగా సహాయం చేస్తున్నప్పటికి సామూహికంగా మాత్రం సాటా అధ్వర్యంలో ఇప్పుడు అందరికి సహాయం చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయ కార్మికులు.. చేసిన పనికి వేతనాలు అందక, కంపెనీ వల్ల వీసాలు రెన్యువల్ కాలేక ఇబ్బందులను ఎదుర్కోంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తినడానికి తిండి లేక చేతిలో చిల్లిగవ్వ లేకుండా నరకయాతన అనుభవిస్తున్న ఈ కార్మికుల గురించి ముజ్జమీల్.. తోటి తెలుగు వారి దృష్టికి తీసుకొచ్చారు. అందరూ కలిసి ఉద్యోగాలు కోల్పోయిన ప్రవాసులకు సాయం చేశారు.

కార్మికులలో తెలుగు వారెవరూ లేకున్నప్పటికీ మానవత దృక్పథంతో.. భారతీయుత అనే భావనతో తెలుగు ప్రవాసీయులు వీరికి చేసిన సహాయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. సాటా చేసిన సాయాన్ని మర్చిపోలేమని ఈ సందర్భంగా పలువరు ప్రవాసులు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-17T16:16:10+05:30 IST