New Parliament : కొత్త పార్లమెంటు భవనం.. ప్రజలకు బంగారంలాంటి ఆఫర్ ఇచ్చిన మోదీ..

ABN , First Publish Date - 2023-05-26T20:49:28+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను

New Parliament : కొత్త పార్లమెంటు భవనం.. ప్రజలకు బంగారంలాంటి ఆఫర్ ఇచ్చిన మోదీ..
Narendra Modi, New Parliament Building

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను ట్వీట్ చేసి, దీనిని ఎవరికివారు తమ సొంత వాయిస్-ఓవర్‌తో తమ ఆలోచనలను పంచుకుంటూ, రీట్వీట్ చేయాలని కోరారు. దీనిని రీషేర్ చేసేటపుడు #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలని కోరారు. వీటిలో కొన్నిటిని తాను రీట్వీట్ చేస్తానని తెలిపారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించబోతున్నారు. తెదేపా, వైకాపా, బీజేడీ, ఎస్ఏడీ తదితర పార్టీలతో సహా అధికార కూటమి పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేత ప్రారంభింపజేయకపోవడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నూతన పార్లమెంటు భవనం ప్రతి భారతీయునికి గర్వకారణం. ఈ సుప్రసిద్ధ భవనాన్ని ఈ వీడియో చూపిస్తుంది. మీకు నాదొక ప్రత్యేక విజ్ఞప్తి - మీ ఆలోచనలను తెలియజేస్తూ, మీ సొంత వాయిస్-ఓవర్‌తో ఈ వీడియోను రీషేర్ చేయండి. నేను వాటిలో కొన్నిటిని రీట్వీట్ చేస్తాను. #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం మర్చిపోవద్దు’’ అని కోరారు.

ఈ నూతన పార్లమెంటు భవనాన్ని అత్యాధునిక, సంప్రదాయ భారతీయ వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. సమకాలిక సౌందర్య, కళా వైభవం, భారత దేశ చరిత్ర, సంస్కృతుల మేళవింపు కనిపిస్తోంది. భారత దేశ సుసంపన్న కళా వారసత్వాన్ని గుర్తు చేస్తూ అలంకృత శిల్పాలు, నమూనాలు ఈ భవనం వెలుపల కనిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఈ వీడియోను #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌తో రీట్వీట్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సడలని నిబద్ధత కారణంగా రికార్డు సమయంలో భారత దేశం అద్భుతమైన తన సొంత పార్లమెంటు భవనాన్ని నిర్మించుకున్నందుకు తన హృదయం గర్వంతో ఉప్పొంగిపోతోందని చెప్పారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) ఇచ్చిన ట్వీట్‌లో, నూతన పార్లమెంటు భవనం, దాని సౌందర్యం, గాంభీర్యం, వైభవం భారత దేశ శక్తి, ఆత్మవిశ్వాసాలకు చిహ్నంగా సమున్నతంగా నిలిచినట్లు తెలిపారు. భారత దేశ ప్రకాశవంతమైన ప్రజాస్వామ్య దేవాలయమైన ఈ అద్భుత, సుప్రసిద్ధ కట్టడాన్ని అందించినందుకు, ప్రధాన మంత్రి గారూ, మీకు భావితరాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయని తెలిపారు. ఈ భవనంలోని ప్రతి ఇటుక నవ భారతం, 140 కోట్ల మంది ప్రజల దృఢసంకల్పాన్ని చాటిచెబుతాయన్నారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి

New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Updated Date - 2023-05-26T20:58:09+05:30 IST