Raksha Bandhan: మెగాస్టార్‌కు రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2023-08-30T22:02:14+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు ఆమె రాఖీ కట్టారు.

Raksha Bandhan: మెగాస్టార్‌కు రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ

ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు ఆమె రాఖీ కట్టారు. అనంతరం అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ కుటుంబసభ్యులు జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య బచ్చన్, శ్వేతా నంద, నవ్య నవేలి నంద కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. అలాగే “ఈ రోజు శ్రీమతి జయ బచ్చన్‌ వారి కుటుంబాన్ని ముంబైలోని వారి నివాసంలో గౌరవనీయులైన సీఎం శ్రీమతి మమతా బెనర్జీ గారు కలిశారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.” అని ట్విట్ చేసింది. కాగా ఆగష్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన మమతా బెనర్జీ.. అమితాబ్ బచ్చన్‌ను కలిశారు.


అనంతరం అమితాబ్ బచ్చన్ కుటుంబంతో కలిసి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “నేను ఈ రోజు సంతోషంగా ఉన్నాను. నేను భారతరత్నగా భావించే అమితాబ్ బచ్చన్ కలిశాను. ఆయనకు రాఖీ కూడా కట్టాను. నాకు అమితాబ్ బచ్చన్ కుటుంబం అంటే చాలా ఇష్టం. వారిది భారతదేశంలోనే నంబర్ వన్ కుటుంబం. బెంగాల్‌లో జరిగే దుర్గాపూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరు కావాల్సిందిగా నేను అమితాబ్ బచ్చన్‌ను ఆహ్వానించాను.’’ అని మమతా బెనర్జీ తెలిపారు. కాగా నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య ఎంపీ జయ బచ్చన్‌తో మమతా బెనర్జీకి మంచి స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇక ప్రస్తుతం అమితాబ్ ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Updated Date - 2023-08-30T22:02:14+05:30 IST