Share News

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

ABN , Publish Date - Dec 25 , 2023 | 11:15 AM

దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Covid-19: 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4,054 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం నాటికి 3,742 గా ఉన్న యాక్టివ్ కేసులు, సోమవారం నాటికి 4 వేలు దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. కొత్తగా 628 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 5,33,334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని థానేలో నవంబర్ 30 నుంచి పరీక్షించిన 20 నమూనాలలో ఐదు JN.1 కేసులు నమోదైనట్లు ఒక అధికారి తెలిపారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. అయితే వారెవరూ కూడా ఆసుపత్రిలో చేరలేదు. ప్రస్తుతం థానేలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 28కు చేరుకుంది. వారిలో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇళ్లలోనే కోలుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. ఇక ఆదివారం దేశ వ్యాప్తంగా 656 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. అంతకుముందు రోజు శనివారం 752 కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ముందు జాగ్రత్తగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని తెలిపింది. కాగా భారతదేశంలో JN.1 వేరియంట్ కారణంగా ఎటువంటి క్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అన్ని కేసులు తేలికపాటివిగా చెప్పారు. రోగులు ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నారని వారు తెలిపారు.

Updated Date - Dec 25 , 2023 | 12:29 PM