New Parliament Building : కొత్త పార్లమెంటు భవనంలో అత్యాధునిక హంగులు

ABN , First Publish Date - 2023-08-06T12:39:57+05:30 IST

అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో అన్ని రకాల సదుపాయాలతోపాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హైటెక్ కృత్రిమ మేధాశక్తితో కూడిన పరికరాలు ఈ భవనంలోకి ప్రవేశించే పార్లమెంటు సభ్యులు, అధికారులు, సిబ్బందిని గుర్తించి, లోనికి పంపిస్తాయి.

New Parliament Building : కొత్త పార్లమెంటు భవనంలో అత్యాధునిక హంగులు

న్యూఢిల్లీ : అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో అన్ని రకాల సదుపాయాలతోపాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హైటెక్ కృత్రిమ మేధాశక్తితో కూడిన పరికరాలు ఈ భవనంలోకి ప్రవేశించే పార్లమెంటు సభ్యులు, అధికారులు, సిబ్బందిని గుర్తించి, లోనికి పంపిస్తాయి. ఓ విధానం మొరాయించినపుడు మరో సురక్షిత విధానంలో లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

నూతన పార్లమెంటు భవనంలోనికి ప్రవేశించేవారిని గుర్తించేందుకు, అనుమతించేందుకు హైటెక్ అడ్వాన్స్‌డ్ ఫేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్లమెంటు ద్వారాల వద్ద ముఖాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారులను గుర్తించేందుకు స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. వీరు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేటపుడు, వీరిని గుర్తించి, తలుపులు తెరుచుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రవేశ మార్గాలకు ఆరు మీటర్ల దూరంలో ఉండగానే వీరిని గుర్తించగలిగే విధంగా ఏర్పాట్లు జరిగాయి.

ఎంపీల ముఖాలను స్కాన్ చేయడంతోపాటు, పాస్‌పోర్ట్ రెన్యూవల్ సమయంలో సేకరించే వివరాలను కూడా ఎంపీల నుంచి నూతన పార్లమెంటు భవనంలో సేకరించారు. ఒకవేళ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పని చేయకపోతే, వేలిముద్రలు లేదా ప్రత్యేకమైన పిన్ ద్వారా లోపలికి ప్రవేశించేందుకు అవకాశం కల్పించారు. నిర్దిష్ట ప్రదేశాల్లోకి అందుకు సంబంధించినవారిని మాత్రమే అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీని కోసం స్మార్ట్ కార్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అప్లికేషన్స్ ద్వారా ఈ ఏర్పాటు చేశారు. క్రెడిట్ కార్డు తరహాలో ఉండే స్మార్ట్ కార్డ్ ద్వారా పార్లమెంటు భవనంలోకి ప్రవేశించే అవకాశం కల్పించారు. ఈ ఎన్‌క్రిప్టెడ్ డేటాను ప్రస్తుతం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) అభివృద్ధి చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో CDAC పని చేస్తోంది.

ప్రధాన మంత్రి కూర్చునే విభాగంలోకి పీఎంఓ అనుమతి ఉన్నవారు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతించే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఎవరు ఏ మార్గంలో వెళ్లాలో సూచించే ఓ మొబిలిటీ యాప్‌ను కూడా తయారు చేశారు. పార్లమెంటు లాబీలు, కారిడార్లలోకి మీడియాను అనుమతిస్తారు. పదేళ్లకుపైబడిన అనుభవంగల జర్నలిస్టులు సెంట్రల్ హాల్‌లోకి వెళ్లవచ్చు. మీడియా కార్డుగలవారు కేంటీన్, ఫెసిలిటీస్ రూమ్‌‌లోకి కూడా వెళ్లవచ్చు. సందర్శకుల కోసం మూడు ఆర్ట్ గేలరీలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి :

Taiwan Vs China : తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందా?

Hyderabad Student : అమెరికాలో ఆకలితో బాధపడుతున్న హైదరాబాద్ విద్యార్థినికి ఇండియన్ కాన్సులేట్ అండదండలు

Updated Date - 2023-08-06T12:39:57+05:30 IST