Hyderabad Student : అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ విద్యార్థినికి ఇండియన్ కాన్సులేట్ అండదండలు

ABN , First Publish Date - 2023-08-06T10:40:37+05:30 IST

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి, ఆకలితో బాధపడుతూ, వీథిలో ఏకాకిగా గడుపుతున్న హైదరాబాద్ విద్యార్థిని సయేదా లులు మిన్హాజ్ జైదీ కి చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ అండగా నిలిచింది. వైద్య సహాయం అందజేయడంతోపాటు, భారత దేశానికి తిరిగి వెళ్లడానికి సహాయపడతామని తెలిపింది.

Hyderabad Student : అమెరికాలో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ విద్యార్థినికి ఇండియన్ కాన్సులేట్ అండదండలు
Syeda Jaidi

చికాగో : ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి, ఆకలితో బాధపడుతూ, వీథిలో ఏకాకిగా గడుపుతున్న హైదరాబాద్ విద్యార్థిని సయేదా లులు మిన్హాజ్ జైదీ (Syeda Lulu Minhaj Zaidi)కి చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ అండగా నిలిచింది. వైద్య సహాయం అందజేయడంతోపాటు, భారత దేశానికి తిరిగి వెళ్లడానికి సహాయపడతామని తెలిపింది. బాధితురాలి తల్లితో మాట్లాడినట్లు తెలిపింది. అన్ని విధాలుగా సాయపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఆకలితో వీథిలో గడుపుతున్న సయేదా జైదీని కలిశామని, ఆమె శారీరకంగా, మానసికంగా యోగ్యమైన స్థితిలో ఉన్నారని చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ తెలిపారు. ఆమెకు వైద్య సహాయం, భారత దేశానికి తిరిగి వెళ్లడానికి సహాయం అందజేస్తామని తెలిపారు. భారత దేశంలోని ఆమె తల్లితో తాము మాట్లాడామని, అయితే దీనిపై ఆమె తల్లి ఇంకా స్పందించవలసి ఉందన్నారు.

సయేదా జైదీ వీథుల్లో కనిపించడంతో భారత దేశంలో ఉన్న ఆమె తల్లి సయేదా వహజ్ ఫాతిమా విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని, తన కుమార్తెను సాధ్యమైనంత త్వరగా రప్పించాలని కోరారు. తన కుమార్తె 2021 ఆగస్టులో డెట్రాయిట్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వెళ్లినట్లు తెలిపారు. ఆమె తమతో తరచూ మాట్లాడేదని, కానీ రెండు నెలల నుంచి ఆమె తమతో మాట్లాడటం లేదని చెప్పారు. అయితే తన కుమార్తె తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా తెలిసిందన్నారు. ఆమె వద్దనున్న అన్ని వస్తువులను ఎవరో దొంగిలించినట్లు, ఫలితంగా చికాగో రోడ్లపైకి చేరినట్లు తెలిసిందని చెప్పారు. వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ ద్వారా ఆమెను కాపాడాలని, ఆమెను సాధ్యమైనంత త్వరగా భారత దేశానికి రప్పించాలని కోరారు.

ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ, తాను ఇచ్చిన ట్వీట్‌కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ నుంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఆమె ఇప్పటికప్పుడు ప్రయాణం చేసే పరిస్థితిలో లేరని చెప్పినట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Taiwan Vs China : తైవాన్‌పై దాడికి చైనా సిద్ధమవుతోందా?

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. మీరు చేసేది ఇదేనా.. కపట నాటకాలు వద్దు

Updated Date - 2023-08-06T10:52:39+05:30 IST