పేకాట జోరు

ABN , First Publish Date - 2022-10-30T23:57:02+05:30 IST

సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్‌, చేర్యాల, గజ్వేల్‌, దుబ్బాక ఏరియాల్లో పేకాట జోరుగా నడుస్తున్నది.

పేకాట జోరు

లాడ్జిలు, గెస్ట్‌హౌజ్‌లు కేంద్రంగా కొనసాగుతున్న వైనం

పలుచోట్ల ఇళ్లలోనూ ఇష్టారాజ్యంగా ‘ఆట’

పేకాట స్థావరాలపై తగ్గుతున్న దాడులు!

ఈ ఏడాది కేవలం 12 కేసులే నమోదు

సిద్దిపేట క్రైం, అక్టోబరు 30: సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్‌, చేర్యాల, గజ్వేల్‌, దుబ్బాక ఏరియాల్లో పేకాట జోరుగా నడుస్తున్నది. పోలీసులు కొన్నిసార్లు దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికీ పేకాటరాయుళ్లు తరచూ అడ్డాలు మారుస్తూ ఆటను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత ప్రతి నెలా మూడు డివిజన్ల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి లాడ్జిలను తనిఖీ చేయాలని సూచించినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది కొన్ని ఏరియాల్లో పోలీసులకు మామూలిస్తూ పేకాట ఆడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

లాడ్జిల్లో, ఫాంహౌజ్‌లలో అడ్డా

సిద్దిపేటలోని హైదరాబాద్‌ రోడ్డులో, కరీంనగర్‌రోడ్డులో ఉన్న లాడ్జిలను నెలల పాటు అద్దెకు తీసుకుని రాత్రింబవళ్లు ఆట ఆడుతున్నట్లు తెలుస్తున్నది. కొన్ని ఏరియాల్లో ఏకంగా ఇళ్లను అద్దెకు తీసుకుని ఆట కొనసాగిస్తున్నట్లు సమాచారం. సిద్దిపేట అర్బన్‌, రూరల్‌ మండలం పరిసర ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాల వద్ద అడ్డాలు ఏర్పరుచుకుని అప్పుడప్పుడు అడ్డాలు మారుస్తూ పేకాట ఆడుతునట్లు తెలుస్తున్నది. మరికొందరు వ్యవసాయబావుల వద్ద ఫాంహౌ్‌సలు కట్టుకుని దర్జాగా పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పది నెలల్లో 12 కేసులు మాత్రమే

ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కేసులు నమోదయ్యేవి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి కేవలం 12 కేసులు మాత్రమే నమోదు చేశారు. 87 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.1,17,864 స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కంటపడకుండా జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తున్నది. లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి పేకాటను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-10-30T23:57:03+05:30 IST