Delhi liquor case: ఢిల్లీ మద్యం స్కామ్‌లో మరో సంచలనం

ABN , First Publish Date - 2023-02-02T16:28:53+05:30 IST

ఈడీ రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లున్నాయి.

Delhi liquor case: ఢిల్లీ మద్యం స్కామ్‌లో మరో సంచలనం
Delhi liquor case

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం స్కామ్‌ (Delhi liquor case) లో మరో సంచలనం. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ (ED) రెండో ఛార్జ్‌షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal,), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha), వైసీపీ ఎంపీ మాగుంట (YSRCP MP Magunta) పేర్లున్నాయి. సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌లో కేజ్రీవాల్‌ పేరు వెల్లడైంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఈడీ చార్జిషీట్‌లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. ఇప్పటికే విచారించిన వారిలో కవిత పేరును ప్రస్తావించారు. అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది.

ఢిల్లీ మద్యం స్కామ్‌ డబ్బులను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ కుంభకోణం కేసులో దక్షిణాది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పునరుద్ఘాటించింది. మద్యం పాలసీ కుంభకోణంలో సిండికేట్‌ కారణంగా ఢిల్లీ సర్కారుకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చార్జ్‌షీట్‌లో స్పష్టంచేసింది. ఈ కేసులో సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు(ఏ1)గా సమీర్‌ మహేంద్రు ఉండగా.. మద్యం వ్యాపారి బినయ్‌ బాబు, అమిత్‌ అరోరా, దక్షిణాదికి చెందిన విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, పి.శరత్‌ చంద్రారెడ్డిలను అరెస్టు చేసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి/ఎక్సైజ్‌ మంత్రి మనీశ్‌ సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు గుర్తుచేసింది. భారీ ఎత్తున అక్రమార్జనకు లోపభూయిష్టంగా విధానాన్ని రూపొందించారని తెలిపింది. హోల్‌సేలర్ల లాభాలను 12 శాతానికి నిర్ణయించారని, అందులో 6 శాతం మేరకు తిరిగి ముడుపులుగా చెల్లించాలనుకున్నారని, అందుకోసం ఖాతా పుస్తకాలను కూడా తారుమారు చేశారని వెల్లడించింది. ఈ కుట్రలో ఆప్‌కు మొత్తం రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. సమీర్‌ మహేంద్రు రూ. 295.45 కోట్ల మేర నేరానికి పాల్పడ్డారని, ఈ మేరకు సాక్ష్యాధారాలు లభించాయని ఈడీ పేర్కొన్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2023-02-02T17:09:19+05:30 IST