హెల్మెట్ పెట్టుకుని చికిత్స చేస్తున్న వైద్యులు.. కారణం ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-07-06T19:23:56+05:30 IST

ఒడిషాలో వైద్యులు హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్స చేస్తున్న ఘటన ఆసక్తికరంగా మారింది. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండాముండా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి భవనం స్లాబ్‌ కొంత భాగం కూలిపోవడంతో దండాముండా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, ఇతర సిబ్బంది హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు.

హెల్మెట్ పెట్టుకుని చికిత్స చేస్తున్న వైద్యులు.. కారణం ఏంటో తెలిస్తే..

ఒడిషాలో వైద్యులు హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్స చేస్తున్న ఘటన ఆసక్తికరంగా మారింది. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండాముండా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి భవనం స్లాబ్‌ కొంత భాగం కూలిపోవడంతో దండాముండా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, ఇతర సిబ్బంది హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ ఘటన ఒడిషాలోని ప్రభుత్వాస్పత్రులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా మారింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బలంగీర్ జిల్లాలోని ఖప్రఖోల్‌లో గల దండముండా ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్న సుమంత నాయక్ సోమవారం మెడిసిన్ వార్డు వద్ద స్లాబ్ కూలిపోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

“ఈ సంఘటన సోమవారం ఉదయం 8.30 గంటలకు జరిగింది. నేను, కొంతమంది రోగులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాము. దీని తరువాత నేను ద్విచక్రవాహనం హెల్మెట్‌‌ని పెట్టుకుని విధులు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రోజు హెల్మెట్‌తో విధులకు హాజరయ్యాను ”అని సుమంత నాయక్ చెప్పుకొచ్చారు. ఆసుపత్రి వైద్యుడు బాలకృష్ణ పురోహిత్‌ మాట్లాడుతూ ‘‘ఆసుపత్రి భవనం అధ్వాన్న స్థితి గురించి ఉన్నతాధికారులకు తెలుసు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల భవనం కూలిపోతుంది. అయినా వారు పట్టించుకోవడం లేదు.”అని చెప్పారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం (OPD) భవనాన్ని ఐదేళ్ల క్రితమే నిర్మించారు. అయితే నాణ్యత లేని పనులు, నాసిరకం మెటీరియల్ వాడడం వల్ల భవనం స్లాబ్ కూలిపోతుంది. అయితే ఇది ఒడిషాలో ఒక్క దండముండా ఆసుపత్రికే పరిమితం కాలేదు. ప్రభుత్వం అధీనంలో ఉన్న అనేక ఆసుపత్రుల్లో పరిస్థితి ఇలాగే ఉందని రోగులు, వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వారు అంటున్నారు.

Updated Date - 2023-07-06T19:26:00+05:30 IST