Jayamangala VenkataRamana: అమరావతి రైతుల ముందు నోరుజారిన వైసీపీ ఎమ్మెల్సీ..!

ABN , First Publish Date - 2023-04-01T13:59:48+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ నోరు జారి మీడియాకు చిక్కారు.

Jayamangala VenkataRamana: అమరావతి రైతుల ముందు నోరుజారిన వైసీపీ ఎమ్మెల్సీ..!

ఏలూరు: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ (YCP MLC Jayamangala Venkataramana) నోరు జారి మీడియాకు చిక్కారు. శనివారం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి దర్శనానికి వచ్చారు. అదే సమయంలో అమరావతి రైతులు స్వామివారి దర్శనానికి వచ్చారు. అక్కడ వెంకటరమణను చూసిన అమరావతి రైతులు... ఆయన వద్దకు వెళ్లి అమరావతి రాజధానిగా ఉండేలా చూడాలని అభ్యర్థించారు. అయితే తాను కూడా మొన్నటి వరకు పోరాటంలోనే ఉన్నానంటూ జయమంగళ నోరు జారారు. అయితే తన మాటలను మీడియా చిత్రీకరించడం చూసి ఎమ్మెల్సీ అవాక్కయ్యారు. వెంటనే వీడియోను డిలీట్ చేయాలని మీడియాకు జయమంగళ వెంకటరమణ సూచించారు.

అయితే జయమంగళం దేన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ సీటు ఇస్తారన్న స్పష్టమైన హామీతో జయమంగళ వెంకటరమణ టీడీపీ (TDP)ని వీడి వైసీపీ (YCP)లోకి వచ్చారు. వైసీపీ అధిష్టానం ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా జయమంగళ వెంకటరమణ పేరును ప్రకటించింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు వైసీపీ అభ్యర్థులు, ఒక టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే వైసీపీ ఆరుగురు అభ్యర్థుల్లో మర్రి రాజశేఖర్‌, బొమ్మి ఇజ్రాయిల్‌, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణరాజు 22 ఓట్లతో విజయం సాధించారు. అయితే మిగిలిన ఇద్దరు సభ్యులు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు చెరో 21 ఓట్లు వచ్చాయి. చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా గట్టెక్కగా.. కోలా గురువులు ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో తాజాగా జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్సీ ఎన్నికల గురించేనా అనేది హాట్ టాపిక్‌గా నిలిచింది.

Updated Date - 2023-04-01T14:49:47+05:30 IST