Share News

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

ABN , First Publish Date - 2023-11-02T16:06:20+05:30 IST

రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.

Buggana Rajendra Nath : రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది

అమరావతి: రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ఆర్థిక అంశాలపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ ( Yanamala Ramakrishna ) ఆర్థిక కార్యదర్శికి లేఖ రాశారు. తాను సమ ఉజ్జి కాదని భావిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అయన లేఖకు సమాధానం ఇచ్చి ఉండక పోవచ్చు. కొందరు కొత్త వాళ్లు కూడా ఆర్థిక అంశాలపై మాట్లాడుతున్నారు. ఎన్నడూ మాట్లాడని గంటా శ్రీనివాసరావు కూడా ఆర్థికపరమైన అంశాలపై మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 3.72 లక్షల అప్పు చేశారనీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఏపీ ఏర్పాటు అయినప్పటి నుంచి అని వారు తెలుసుకోవాలి. యనమల రామకృష్ణ రాసే ప్రతీ లేఖలోనూ ఆయన పేర్కొన్న అంశాలు భిన్నంగా ఉంటున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా మా శాఖ లోని ఆడిట్ చేసిన వాటిని లేదా కాగ్ లెక్కలు అనుసరించి ప్రకటన చేస్తా. టీడీపీ నేతలు అంతా కూర్చుని ఏపీ అప్పు ఎంతో ఒక లెక్క వేసుకుని ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెబుతాం. ప్రతీసారి ఓ కొత్త లెక్క చెప్పే ప్రయత్నం చేయొద్దని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత అప్పు చేశామో టీడీపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. ఏపీ ఆర్థిక అంశాలపై కాగ్ లెక్కలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలనీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఏ అంశాలపై శ్వేతపత్రం ఇవ్వాలో ఆమెకే స్పష్టత లేదు. ఎంపీలు కనకమేడల, రఘురామ కృష్ణంరాజు లేఖలపై లేఖలు రాస్తున్నారు. ఆర్థిక మంత్రి తప్పుడు లెక్కలు చెబుతారా..? టీడీపీ హయాంలో 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటి గురించి ఎందుకు అడగడం లేదు. కార్పొరేషన్ అప్పుల్లో 58 వేల కోట్లు టీడీపీ హయాంలో చేసినవే. స్థూల ఉత్పత్తి , వార్షిక వృద్ధి రేటు, రెవెన్యూ రాబడి లాంటివి ఆర్థిక పరిస్థితికి బెస్ అవుతుంది. సినిమా డైలాగ్‌లా నోటికి వచ్చిన అంకెను టీడీపీ చెప్పుకొస్తోంది’’ అని బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-02T16:12:12+05:30 IST