హజెలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..
ABN , Publish Date - Aug 22 , 2026 | 07:06 AM
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హజెలో రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు.
యాదాద్రి: భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హజెలో రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సమయంలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో కార్మికులంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పెద్ద శబ్దంతో పేలిపోవడంతో కార్మికులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన యాజమాన్యం, తోటి కార్మికులు.. పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.
హుటాహుటిన చేరుకున్న సహాయక బృందాలు బాధితులను హైదరాబాద్లోని ఆస్పత్రులకు తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అతి కష్టం మీద అదుపు చేశారు. అయితే, చికిత్స పొందుతున్న కార్మికుల్లో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను నల్లగొండ జిల్లా పెద్దఊర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగానబోయిన నరేశ్ కుమార్గా గుర్తించారు. కాగా, రెండు నెలల వ్యవధిలో హజెలో కంపెనీలో ప్రమాదం జరగడం ఇది రెండోసారి. దీంతో కార్మికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, గ్రామస్థులూ తీవ్రంగా భయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పాస్ పుస్తకాలు
మరుగుదొడ్డిని శుభ్రం చేసిన మంత్రి జూపల్లి