రంగారెడ్డి జిల్లా షాబాజ్ హత్యల కేసు.. వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:39 AM
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కలకలం రేపిన హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ ఒక్కడే ఆరుగురిని చంపినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి వెల్లడించారు.
హైదరాబాద్, జులై 1: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కలకలం రేపిన హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ ఒక్కడే ఆరుగురిని కిరాతకంగా చంపినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే రాత్రి జరిగిన ఆరుగురి ఘోర హత్యల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ హ్యతకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి గ్యాంగ్ ప్రమేయం లేదని.. నిందితుడు రాజ్కుమార్ ఒక్కడే ఆరుగురిని చంపినట్లు సీపీ స్పష్టం చేశారు. నిందితుడిపై గతంలో మే 16న ఒక పోక్సో (POCSO) కేసు నమోదైందని, ఆ కేసులో ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడని సీపీ పేర్కొన్నారు.
సీపీ తరుణ్ జోషీ మాట్లాడుతూ.. ‘నిందితుడు రాజ్కుమార్ రాత్రి 11 నుంచి 11:30 గంటల మధ్య వ్యవధిలోనే ఈ ఆరుగురినీ హతమార్చాడు. మొదట బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమె తల్లి, నానమ్మలను చంపేశాడు. రాత్రి 11 గంటల సమయంలో బాలికను బలవంతంగా దైవాలగూడ చెరువు దగ్గరకు తీసుకెళ్లి అక్కడ ప్రాణాలు తీశాడు. తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను కూడా అతికిరాతకంగా హతమార్చాడు. అనంతరం రాజ్కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి, ఆ వెంటనే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. నిందితుడి నేర చరిత్రను పరిశీలిస్తే.. గతంలో అతడిపై పోక్సో కేసుతో పాటూ మరో కేసు కూడా నమోదైంది. రాజ్కుమార్కు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాలు ఉన్నాయి. దీనివల్ల అతనికి దాదాపు రూ. కోటిన్నర వరకు అప్పులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్కుమార్ను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం’ అని సీపీ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!
మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్
For More Viral News And Telugu News