ఔట్ సోర్సింగ్ పోస్టు @ రూ.3 లక్షలు!
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:05 AM
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కొంత మంది ఏజెన్సీల ముసుగులో ఈ ఉద్యోగాలకు ధర నిర్ణయించి మరీ అమ్మేశారు. ఇటీవల ఔట్ సోర్సింగ్ ద్వారా సుమారు 1000 లష్కర్ పోస్టులను భర్తీ చేశారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కొంత మంది ఏజెన్సీల ముసుగులో ఈ ఉద్యోగాలకు ధర నిర్ణయించి మరీ అమ్మేశారు. ఇటీవల ఔట్ సోర్సింగ్ ద్వారా సుమారు 1000 లష్కర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టులను అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం మరిచిపోకముందే తాజాగా నల్లగొండ జిల్లాలోని మహాత్మ గాంధీ యూనివర్సిటీలో 124 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఒక్కో పోస్టు రూ.1.50 లక్షల నుంచి రూ. 3 లక్ష వరకు అమ్ముకోవడం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, అటెండర్ ఖాళీలకు ఉద్యోగులను ఎంపిక చేశారు. ఈ వ్యవహారంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు, అటెండర్ పోస్టుకు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలో నీటి పారుదల శాఖ అవసరాల కోసం నియామకం చేసిన 1000 మంది లష్కర్ ఉద్యోగుల నుంచి కూడా కొంత మంది భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐకాస చైర్మన్ పులి లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గాంధీ వర్సిటీ వ్యవహారంపై సర్కారు ఆరా..
మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ఆధార్ నంబర్లతో లింక్ చేసి ఆర్థిక శాఖ పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల కంటే మరో 100 మందికి అదనంగా జీతాలు తీసుకున్నట్లు తేలింది. రూ.10 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నియామకం, ఏజెన్సీల నుంచి ఎంత మందిని ఎంపిక చేశారు? ఎంత మంది పని చేస్తున్నారు? అనే కోణంలో ఆర్థిక శాఖ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ఆడిట్ విచారణ చేయిస్తున్న ప్రభుత్వం.. వివరాలు పంపాలని విభాగాధిపతులను ఆదేశించింది. ఏజెన్సీల అక్రమాలు, లోపాలు గుర్తించారా? ఏజెన్సీల నిర్వహణపై రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయా? అనే సమాచారం పంపాలని కోరింది.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ