Share News

ఏడుపాయల మహిళ హత్య కేసు.. విచారణలో విస్తుపోయే నిజాలు!

ABN , Publish Date - Mar 11 , 2026 | 08:32 PM

మెదక్ జిల్లా ఏడుపాయల శివారలో జరిగిన మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. అనుమానం పెను భూతమైంది.. వేరే వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానంతో ప్రియుడు కర్రతో అతి దారుణంగా కొట్టి చంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు.

ఏడుపాయల మహిళ హత్య కేసు.. విచారణలో విస్తుపోయే నిజాలు!
Medak Woman Case Solved Police

మెదక్, మార్చి 11: మెదక్ జిల్లా(Medak District) ఏడుపాయల శివారలో జరిగిన మహిళ హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. అనుమానం పెను భూతమైంది.. వేరే వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానంతో ప్రియుడు కర్రతో అతి దారుణంగా కొట్టి చంపినట్లు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. పాపన్న పేట మండలం కొండపాక గ్రామానికి చెందిన సులోచన(35) భర్త మరణించడంతో మెదక్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మేస్త్రీ పని చేసే నాగరాజుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. సులోచనకు నాగరాజు కొంత డబ్బు, బంగారు ఆభరణాలు కొనిచ్చినట్లు తెలిపారు. ఇటీవల నాగరాజుకు సులోచనపై అనుమానం మొదలైంది. సెల్ ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతూ.. తనను నిర్లక్ష్యం చేస్తుందన్న భావించాడు.


సులోచనను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న నాగరాజు, సోమవారం రామాయంపేటకు చెందిన భూల్య అనే మహిళతో కలిసి సులోచనను మోటార్ బైక్ పై ఎక్కించుకొని ఏడుపాయల శివారలోని చెరువు గుట్టకు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగానే ప్లాన్ చేసుకున్న నాగరాజు కర్రతో సులోచన తలపై గట్టిగా కొట్టాడు.. దాంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం భూల్య, నాగరాజు కలిసి సులోచన మెడలో ఉన్న బంగారం ఆభరణాలు తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజు హత్య చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన భూల్యని కూడా అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 08:33 PM