Share News

పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jun 05 , 2026 | 08:17 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చేసిందేమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్, జూన్05: ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చేసిందేమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్‌ కోసం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌పైనే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి పంప్‌లు, లిఫ్ట్‌లు మాత్రమే నిర్మించారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయిల కమీషన్లు కొల్లగొట్టి.. ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఎండగట్టారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల కోసం రూ.52 వేల కోట్లకుపైగా చెల్లించామన్నారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు.


భూసేకరణ కోసం సహకరించాలని కోరుతున్నానని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను అడ్డుకునేలా వ్యవహరించొద్దంటూ వారికి సూచించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడకుండా ఉంటే అదే వాళ్లు చేసే పెద్ద సాయమని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్‌కు ఊడిగం చేయడం మాని జిల్లా కోసం పనిచేయాలంటూ బీఆర్ఎస్ నేతలతోపాటు కార్యకర్తలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ అంటే సారా.. సారా అంటే కేసీఆర్‌ అని సీఎం రేవంత్ అభివర్ణించారు. సోడా అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే సోడా అని ఎద్దేవా చేశారు. దోపిడీ చేయడమే కేసీఆర్‌కు తెలుసునన్నారు. కేసీఆర్‌ సొంతంగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేవలం ప్రాజెక్టులకు పేరు మాత్రమే కేసీఆర్ మార్చారని వ్యంగ్యంగా తెలంగాణ సీఎం అన్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయదా? అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన పంటల కొనుగోలు అంశంలో.. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌‌తోపాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బాధ్యత లేదా? అంటూ వారికి సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. విమర్శలు చేయడం కాదు.. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండంటూ సదరు బీజేపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.


12 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ తెలంగాణకు ఏం చేశారు? అని బీజేపీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను మోదీలు అమలు చేశారా? అంటూ బీజేపీ నేతలను సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలు చేయలేని మోదీ దిగిపోతే.. రాహుల్‌ను ప్రధానిగా చేసుకుని పనులు చేయించుకుంటామని బీజేపీ ఎంపీ అర్వింద్‌కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారని.. అందుకు మా మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


పవన్‌ కల్యాణ్‌ విషయంలో ఇంకా మాట్లాడేదేముందని ఆయన పేర్కొన్నారు. నీళ్ల విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్‌ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని కుండబద్దలు కొట్టారు. గోదావరిలోని 968 టీఎంసీల్లో ఒక్క చుక్కనైనా వదలమన్నారు. మిగిలినది వాళ్లు ఏం చేసుకుంటారో వారి ఇష్టమని సీఎం రేవంత్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

ఒకే కుటుంబంలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురి చిన్నారుల మృతి

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 08:35 PM