మంత్రి పొంగులేటిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: మధుసూదనాచారి
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:42 AM
ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. పొంగులేటి అవినీతి మొత్తం సాక్ష్యాలతో సహా హరీశ్ రావు బయటపెట్టారని ఆయన తెలిపారు.
హైదరాబాద్, మార్చి 30: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం గన్పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన మంత్రి పొంగులేటి అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మైనింగ్ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మంత్రి పొంగులేటి అవినీతి మొత్తం సాక్ష్యాలతో సహా హరీశ్ రావు బయటపెట్టారని ఆయన తెలిపారు.
ఈ ప్రభుత్వం దుర్మార్గ వైఖరితో బీఆర్ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేసిందని మధుసూదనాచారి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నామని పదే పదే చెబుతోందని.. కానీ ఓబులాపురం మైనింగ్ కేసులో అక్రమాలు జరిగాయని చెప్పడంతో నాగం జనార్ధన్ రెడ్డితో సభా సంఘం వేశారని గుర్తు చేశారు. అదే విధంగా పొంగులేటి అక్రమాలపై కూడా సభా సంఘం వేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
ఈరోజు ఉదయం గన్పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్కు పాల్పడిన మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. వాణి దేవి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, తక్కిలపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నిరసనలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్
మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్
Read Latest Telangana News And Telugu News