హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు: దానం నాగేందర్
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:21 PM
హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ఉత్సవ కమిటీ సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 5: నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ను దర్శించుకునేందుకు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్, భద్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున కూడా ఉత్సవాల ఏర్పాట్ల కోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఈసారి సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. గణేశ్ విగ్రహ తయారీ కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన.. అయితే చవితికి రెండు రోజుల ముందుగానే భక్తులకు గణేశుడి దర్శనం కల్పించేలా నిర్విరామంగా పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. విగ్రహ తయారీతో పాటు మండపం, పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. భారీ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News