తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ప్రారంభం: సుదర్శన్ రెడ్డి
ABN , Publish Date - May 16 , 2026 | 01:38 PM
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్వో(BLO)లు ప్రత్యేక సర్వే చేస్తారని అన్నారు.
హైదరాబాద్, మే 16: దేశ వ్యాప్తంగా SIR ప్రక్రియ ప్రారంభమైందని.. తెలంగాణలో జూన్ 25 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్వో(BLO)లు ప్రత్యేక సర్వే చేస్తారని అన్నారు. ప్రతి ఓటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని.. ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు బీఎల్వో సందర్శిస్తారని చెప్పారు. కొత్త ఓటర్ల వివరాలను ఫారం-6లో ప్రత్యేకంగా నమోదు చేస్తారన్నారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ ఎన్యుమరేషన్ అవకాశం ఉందని తెలిపారు. హెల్ప్లైన్ 1950తో పాటు ‘Book a Call with BLO’ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.
ఎన్యుమరేషన్ దశలో ఫారం తప్ప అదనపు పత్రాలు అవసరం లేదని సీఈవో తెలిపారు. ఫారం ఇచ్చిన వారందరి పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చుతారని, ఫారం ఇవ్వని ఓటర్ల జాబితా బూత్ వారీగా ప్రదర్శిస్తారని తెలిపారు. డ్రాఫ్ట్ రోల్స్ తర్వాత అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. పుట్టిన తేదీ ఆధారంగా పత్రాల సమర్పణకు నిబంధనలు వర్తిస్తాయన్నారు. 1987 జూలై 1కు ముందు పుట్టిన వారికి ఒకే పత్రం సరిపోతుందని.. 1987 - 2004 మధ్య పుట్టిన వారికి తల్లిదండ్రుల వివరాలు కూడా తప్పనిసరి అని చెప్పారు. 2004 తర్వాత జన్మించిన వారికి తల్లిదండ్రుల పత్రాలు తప్పనిసరన్నారు.
2002లో రాష్ట్రంలో SIR చేశారని సీఈవో తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలన్నదే ఎస్ఐఆర్ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 3.45 కోట్ల ఓటర్లు, 35 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. పొలిటికల్ పార్టీలకు కూడా SIRపై సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్యుమరేషన్ తర్వాత డ్రాఫ్ట్ విడుదల చేస్తామని.. అందులో చూసుకొని ఓటర్లు మార్పు, చేర్పులు చేసుకోవచ్చని సీఈవో సుందర్శన్ రెడ్డి వెల్లడించారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే
జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల
ఇవి కూడా చదవండి...
పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు
పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం
Read Latest Telangana News And Telugu News