జులై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్.. ఆర్టీసీ ఉద్యోగులకు పొన్నం ప్రభాకర్ శుభవార్త
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:05 PM
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ సమ్మెలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు(గురువారం) టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్లకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
హుజూర్నగర్, కోదాడ, నాగర్కర్నూల్ బస్ స్టేషన్లకు కూడా మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగు బస్ స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహాలక్ష్మీ పథకంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు చెందిన 553 బస్సుల పనితీరుపై మంత్రి నివేదిక కోరారు. రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఆర్టీసీ వద్ద 10,173 బస్సులు.. 38,128 మంది ఉద్యోగులు ఉన్నారని, రోజుకు 61 లక్షల మంది ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ సేవలు పొందుతున్నట్లు తెలిపారు.
పెండింగ్ కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను పొన్నం ఆదేశించారు. తొలగించిన ఉద్యోగుల్లో 244 మందికి ఇప్పటికే విధుల్లోకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగి శంకర్ కుటుంబానికి రూ.1 కోటి చెక్కును ఆర్టీసీ అందజేయనున్నట్లు తెలిపారు. శంకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దక్షిణ భారత రవాణా శాఖ మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశం జరగనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
ఆనాడు నా మదిలో పుట్టిన ఆలోచనకు ఆచరణే నేటి వనమహోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News