CM Chandrababu: కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలిగింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:15 PM
పార్టీ ఆఫీస్కు ఎప్పుడు వెళ్లినా.. తనకు పిన్నమనేని సాయిబాబా స్వాగతం పలికేవారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేశారని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 04: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా (69) మృతితో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ ఆఫీస్కు ఎప్పుడు వెళ్లినా.. తనకు ఆయన స్వాగతం పలికేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేశారని వివరించారు. ఆదివారం హైదరాబాద్లో పిన్నమనేని సాయిబాబా కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు.
అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన తన కుటుంబం కోసం కాకుండా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి సాయిబాబా అని గుర్తు చేసుకున్నారు. సాయిబాబా కుటుంబానికి కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత.. పార్టీ అధినేతగా ఆ కుటుంబ పెద్దగా తాను తీసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాయిబాబా కుటుంబానికి ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం తనకు చాలా బాధ కలిగిందన్నారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి శనివారం వరకు .. చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసం పని చేసిన వ్యక్తి పిన్నమనేని సాయిబాబా అని వివరించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. ఆయన అభిమానిగా పార్టీలో చేరడం.. నాటి నుంచి అనునిత్యం పార్టీ కోసం పని చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం పిన్నమనేని సాయిబాబు ఎనలేని సేవలు అందించారన్నారు. చివరి రోజుల్లో నడవ లేని పరిస్థితుల్లో వీల్ చైర్లో వచ్చి పార్టీ ఆఫీస్లో కుర్చొనే వారన్నారు.
పార్టీ కోసం ఒక కమిట్మెంట్తో పని చేసిన వ్యక్తి పిన్నమనేని సాయిబాబా అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు దివ్యాంగుల కార్పొరేషన్కు చైర్మన్గా సేవలందించారని వివరించారు. అనేక సార్లు ఆయన పార్టీ పదవుల్లో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంలో సైతం భాగస్వాములయ్యారని చెప్పారు. అనేక కార్యక్రమాలు సైతం ఆయన చేపట్టారన్నారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆయనను చూసినప్పుడు చాలా బాధేస్తుందన్నారు.
డిసెంబర్ 28వ తేదీన హైదరాబాద్లోని తన నివాసంలో పిన్నమనేని సాయిబాబా మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గతంలో అఖిల భారత ఎన్టీఆర్ ఆభిమాన సంఘాల సమైక్య అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్ధ చైర్మన్గా ఆయన పని చేశారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నర్శింహులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవిందకుమార్గౌడ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తదితరులు సాయిబాబా పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ సాయిబాబా సంతాపం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
For More TG News And Telugu News