హైదరాబాద్లో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే
ABN , Publish Date - Feb 19 , 2026 | 09:25 AM
హైదరాబాద్లోని చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్య కేసులో జీఆర్పీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 19: హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన తల్లి, ఇద్దరు బిడ్డల ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. విజయశాంతి రెడ్డి.. తన కుమారుడు, కుమార్తెతో కలిసి రైలు కిందపడి మృతిచెందారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ వివాదాలు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు.
ఈ కేసులో ఎలాంటి అనుమానాలు లేవని జీఆర్పీ పోలీసులకు కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. ముగ్గురి ఆత్మహత్యలో మరొకరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ, సూసైడ్ నోట్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు పోలీసులు. వాట్సాప్ చాటింగ్లను రిట్రీవ్ చేసి ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా పూర్తి చేశారు. ట్రాక్పై ముగ్గురే ఉన్నారని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని లోకో పైలట్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆర్థిక, వ్యక్తిగత గొడవలు లేవని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. రెండు నెలలుగా మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒంటరితనమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను దూరమైతే పిల్లలు ఒంటరిగా మిగిలిపోతారనే ఆలోచనతోనే తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించామని జీఆర్పీ పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
వినుకొండలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
రఫేల్ ఫైటర్లలో.. భారత్ వాటా పెంచాలి
Read Latest Telangana News And Telugu News