Share News

తెలంగాణకు 9.56 లక్షల ఇళ్లు

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:56 AM

తెలంగాణకు 9.56 లక్షల ఇళ్ల కేటాయింపుతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర సహకారం కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రిని కలిశారు. విదేశాల్లోని తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎన్నారై కమిషన్‌ ఏర్పాటు చేయాలని వినతి అందింది.

తెలంగాణకు 9.56 లక్షల ఇళ్లు
Revanth Reddy

  • కేటాయించాలని కేంద్ర మంత్రి

  • చౌహాన్‌ను కోరిన సీఎం రేవంత్‌

  • ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు

  • సహకరించాలనీ విజ్ఞప్తి

  • ప్రపంచం చూపు.. హైదరాబాద్‌ వైపు

  • పెట్టుబడులు, విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు కేంద్రంగా నగరం

  • ‘వర్సిటీ’లతో చర్చలు సక్సెస్‌: సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల, సీఎస్‌ సంజయ్‌ జాజు, ఉన్నతాధికారులతో పాటు కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేంద్రమంత్రికి సీఎం వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్తు వినియోగం పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రిని సీఎం కోరగా.. కేంద్రం 2 లక్షల ఇళ్లు కేటాయించింది. దీనికి తాజాగా కృతజ్ఞతలు తెలిపిన సీఎం.. డిమాండ్‌ మేరకు మిగతా ఇళ్లనూ కేటాయించాలన్నారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


ప్రత్యేక ఎన్నారై కమిషన్‌ను ఏర్పాటు చేయండి

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ఎన్నారై కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోరారు. అసెంబ్లీలోని చాంబర్‌లో సీఎంను కలిసిన అద్దంకి దయాకర్‌, ఝాన్సీరెడ్డిలు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఎన్నారై కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు.


విదేశాల్లో ఉంటూ తెలంగాణ పురోభివృద్ధికి సహకరిస్తున్న ఎన్నారైలు.. ఈ రాష్ట్రంలో వారి ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించునే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ మార్గదర్శకత్వం, సమన్వయం అందించడం, విదేశీ తెలంగాణ సంస్థలకు-రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగమని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రైతన్నపై ఎల్‌నినో పిడుగు

హాస్టల్‌ భవనం ఓ పక్కకు ఒరిగింది!

Updated Date - Sep 19 , 2026 | 05:56 AM